Viral Video: వేలాది మంది రైతులు ముంబై వైపుగా పాదయాత్ర..

15 Mar, 2023 19:58 IST|Sakshi

వేలాది మంది రైతులు ముంబై వైపుగా సైనికుల మాదిరి కవాతు చేస్తున్నట్లుగా కదిలి వచ్చారు. ఈ పాదయాత్ర సీపీఎం ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ మేరకు ఆ రైతులు నాసిక్‌ జిల్లా దిండోరి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ముంబై చేరుకోవడానికి మునుపే సుమారు  200 కి.మీ పాదయాత్ర పూర్తి చేశారు. ఈ పాదయాత్రలో అసంఘటిత రంగానికి చెందిన అనేక మంది కార్మికులు, ఆశా వర్కర్లు, గిరిజన సంఘాల సభ్యులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. వారంతా తమ డిమాండ్ల నేరవేర్చుకోవడం కోస ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలుస్తోంది.

రైతుల డిమాండ్లు

  • ఉల్లి సాగు చేసే రైతులకు క్వింటాల్‌కు రూ. 600/ తక్షణ ఆర్థిక సాయం అందించాలని రైతులు డిమాండ్‌ చేశారు. మహారాష్ట్రలో ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఐతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే అధిక ఉత్పత్తే ఈ పరిస్థితికి కారణమంటూ క్వింటాల్‌ ఉ‍ల్లికి రూ. 300 నష్ట పరిహారాన్ని ప్రకటించారు. 
  • అలాగే 12 గంటల పాటు నిరంతర విద్యుత్‌ని అందించాలని, వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అంతేగాదు సోయాబీన్‌, పత్తి, కందిపప్పు ధరలు తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. అధిక వర్షాలు, ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయే రైతులకు తక్షణ సాయం అందించాలని కోరారు.
  • 2005 తర్వాత ఉద్యోగం చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ప్రభుత్వ స్పందన
రాష్ట్ర ప్రభుత్వం నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల వద్దకు చేరుకోనుంది. ఈ మేరకు ఇద్దరు క్యాబినేట్‌ మంత్రులు దాదా భూసే, అతుల్‌ సేవ్‌ ముంబైకి వెళ్లే మార్గంలో వారిని కలవనున్నారు. రైతుల ప్రతినిధుల మధ్య సమావేశం జరగాల్సి ఉంది. కానీ రైతులు మాత్రం ప్రభుత్వ ప్రతినిధులు తమను కలవాలని కోరుతున్నారు. ప్రతిపక్ష నేత అజిత్‌ పవార్‌, సీపీఎం ఎమ్మెల్యే వినోద్‌ నికోల్‌లు రైతులతో ప్రభుత్వం మాట్లాడాలని అసెంబ్లీలో అన్నారు.

దీనిపై మంత్రి భూసే స్పందిస్తూ..సమావేశం నిర్వహించి రైతులతో అవగాహన కుదుర్చుకుంటామని చెప్పారు. వారికి మొత్తం 14 డిమాండ్లు ఉన్నాయని, చట్టం పరిధిలో సాధ్యమైనంత మేర ప్రభుత్వం వాటిని తప్పక పరిష్కరిస్తుంది. కాగా, ఈ పాదయాత్ర అచ్చం 2018లో నాసిక్‌ నుంచి ముంబై వరకు సాగిన కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ తరహాలోనే కొనసాగుతోంది. 

(చదవండి: రైడ్‌ బుక్‌ చేసుకున్న మహిళకు చేదు అనుభవం..స్పందించిన కంపెనీ)

మరిన్ని వార్తలు