Viral Video: మహిళ‌ను కిడ్నాప్ చేసిన 15 మంది యువ‌కులు.. ఇంటి గేటు ప‌గల‌గొట్టి

3 Aug, 2022 15:36 IST|Sakshi

సాక్షి, చెన్నై:  ఓ మహిళ ఇంట్లోకి 15 మంది యువకులు చొరబడి ఆమెను కిడ్నాప్‌ చేశారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో మంగ‌ళ‌వారం రాత్రి చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన‌ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ‌య్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మైలాడుతురైలోని మ‌హిళ నివాసం ముందు ఉన్న గేటును ప‌గుల‌గొట్టి 15 మంది యువ‌కులు ఇంట్లోకి దౌర్జ‌న్యంగా ప్ర‌వేశించారు. అయితే అదే రోజు రాత్రి పోలీసులు మ‌హిళ‌ను కాపాడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు .

కాగా నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుల్లో ఒక‌రైన 34 ఏళ్ల విఘ్నేశ్వ‌ర‌న్ మ‌హిళ‌తో  ప‌రిచ‌యం పెంచుకొని స్నేహం పేరుతో ఆమె వెంట‌ప‌డినట్లు పోలీసుల ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింది. విఘ్నేశ్వ‌ర‌న్ వేధింపులతో విసుగెత్తిన స‌ద‌రు మ‌హిళ మైలాడుతురై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు అత‌న్ని స్టేష‌న్‌కు తీసుకొచ్చి బెదిరించారు. ఇంకోసారి ఇలా చేయ‌కూడ‌ద‌ని స్టేట్‌మెంట్ తీసుకొని విడుద‌ల చేశారు. అయితే తనపై కేసు పెట్టిన మ‌హిళ‌పై విఘ్నేశ్వ‌ర‌న్ ప‌గ‌ పెంచుకున్నాడు.

జూలై 12న కొంత‌మందితో క‌లిసి మ‌హిళ‌ను కిడ్నాప్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా... ఆమె తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు.అయితే మ‌హిళ‌పై మ‌రింత కోపం పెంచుకున్న విఘ్నేశ్వ‌ర‌న్ మ‌రో 14 మంది అనుచ‌రుల‌తో క‌లిసి మంగ‌ళ‌వారం రాత్రి మ‌హిళ ఇంటి త‌లుపులు బ‌ద్ద‌లుకొట్టి కుటుంబ స‌భ్యుల‌ను క‌త్తుల‌తో బెదిరించి ఆమెను తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న మైలాడుతురై పోలీసులు వెంటనే గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అదే రోజు రాత్రి జాతీయ రహదారిపై కిడ్నాప‌ర్ల కారును అడ్డ‌గించి మ‌హిళ‌ను ర‌క్షించారు. విఘ్నేశ్వరన్‌తో పాటు అతని ఇద్దరు సహచరులను అదుపులోకి తీసుకున్నారు. 

చదవండి: యుద్ధ సైరన్‌ల మధ్య ప్రియురాలికి ప్రపోజ్‌: వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు