Viral Video: ఆమె పాదాలను పాలతో కడిగి.. ఆ పాలు తాగారు!

23 Aug, 2022 18:28 IST|Sakshi

ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందంటారు. చిన్నారి పాపలను అదృష్ట దేవతలుగా భావిస్తుంటారు. అంతేకాదు ఆడపిల్లలను అల్లారుముద్దుగా, అపురూపంగా చూసుకుంటారు. తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్‌ అయిన ఓ వీడియో ఇలాంటి భావనను మన కళ్ల ముందుకు తెచ్చింది. జార్ఖండ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ కుమార్‌ ట్విటర్‌లో ఈ వీడియోను షేర్‌ చేశారు. ‘భావోద్వేగ క్షణం. తల్లిదండ్రులు తమ కుమార్తెకు వీడ్కోలు చెబుతూ ఆమె పాదముద్రలను ఇంట్లో భద్రపరుస్తార’ని వీడియోకు క్యాప్షన్‌ పెట్టారు. 

ఇంతకీ వీడియోలో ఏముంది?
ఓ యువతిని కుర్చీలో కూర్చోపెట్టి తల్లిదండ్రులు ఆమె పాదాల చెంత కూర్చుంటారు. ఆమె పాదాలను పళ్లెంలో ఉంచి ముందుగా తండ్రి నీళ్లతో కడుగుతాడు. తర్వాత పాలతో పాదాలను కడుగుతాడు. పాదాలను కలిగిన పాలను తండ్రితో పాటు యువతి తల్లి కూడా తాగుతారు. తర్వాత యువతి పాదాలను ఎరుపు రంగు నీళ్లలో ఉంచి తెల్లటి వస్త్రంపై ఆమె పాదముద్రలు పడేలా చేస్తారు. అయితే ఈ వీడియోలోని వారు ఎక్కడ వారనే వివరాలు వెల్లడించలేదు. అంతేకాదు ఈ వీడియో ఎప్పటిదనే విషయం కూడా తెలియదు. కానీ ఆ తల్లిదండ్రులు చేసిన పని మాత్రం ఎంతో మందిని కదిలించింది.

మిశ్రమ స్పందన
రెండు నిమిషాల 15 సెకన్ల ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్‌ చేయగానే లక్షకు పైగా వ్యూస్‌తో వైరల్‌గా మారింది.  ఈ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ‘హార్ట్‌ టచింగ్‌’ అంటూ చాలా మంది మెచ్చుకున్నారు. ‘భారతీయ సంస్కృతిలోని గొప్పదనానికి మచ్చుతునక’ అంటూ ఒకరు కామెంట్‌ చేశారు. ‘ఇంకా ఏ యుగంలో ఉన్నారు సార్‌ అని మరొకరు అంటే.. ‘ఇదంతా బాగానే ఉంది కానీ ఆమెకు ఆస్తిలో వాటా ఇవ్వండి’ అని ఇంకొరు వ్యాఖ్యానించారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఆడపిల్లను అపురూపంగా చూసుకోవాలన్న సందేశాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. (క్లిక్‌: ప్రియురాలు బ్రేకప్‌ చెప్పిందని.. ఏకంగా 70 కిలోలు తగ్గి)

మరిన్ని వార్తలు