చిన్నమ్మకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లు

20 Nov, 2020 07:45 IST|Sakshi

బ్రహ్మరథానికి కసరత్తులు 

60 చోట్ల ఆహ్వాన ఏర్పాట్లు 

సాక్షి,చెన్నై: చిన్నమ్మ శశికళ రాక కోసం అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాల్లో ఎదురుచూపులు పెరిగాయి. ఆమెకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. కోర్టు విధించిన రూ.10 కోట్ల 10 లక్షల జరిమానాను చిన్నమ్మ తరఫు న్యాయవాదులు చెల్లించిన విషయం తెలిసిందే. ఈ చెల్లింపునకు తగ్గ రశీదులు, చిన్నమ్మ జైలు జీవితం, విడుదలకు తగ్గ విజ్ఞప్తితో కూడిన ఓ పిటిషన్‌ను ఆమె తరఫు న్యాయవాదులు గురువారం బెంగళూరు పరప్పన అగ్రహార జైలు వర్గాలకు సమర్పించారు. దీంతో చిన్నమ్మ  ఒకటి రెండు రోజుల్లో జైలు నుంచి బయటకు రావచ్చన్న ఎదురుచూపుల్లో న్యాయవాదులు ఉన్నారు. ముందుగానే చిన్నమ్మ వచ్చేస్తున్నారని ఆమె న్యాయవాది రాజాచెందూర్‌ పాండియన్‌ చెబుతుండడంతో అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాల్లో ఎదురు చూపులు పెరిగాయి.

చిన్నమ్మకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. కళగం ముఖ్యనేతలు మాత్రమే బెంగళూరుకు పయనం కావడం, మిగిలిన నేతలందరూ తమిళనాడు– కర్ణాటక సరిహద్దుల్లో ఉండి, చిన్నమ్మకు ఆహ్వానం పలికేందుకు తగ్గట్టుగా కార్యాచరణ సిద్ధం చేసి ఉండడం గమనార్హం. హొసూరు నుంచి చెన్నై వరకు జాతీయరహదారిలోని కొన్ని ఎంపిక చేసిన పట్టణ ప్రవేశ ద్వారాల వద్ద చిన్నమ్మకు ఆహ్వానం పలికేందుకు తగ్గట్టుగా పార్టీ వర్గాలు ఏకమయ్యేందుకు నిర్ణయించారు. 60 చోట్ల బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై అమ్మ శిబిరం పరుగులు తీస్తుండడం చూస్తే, మరికొద్ది రోజుల్లో చిన్నమ్మ బయటకు వచ్చేస్తారేమో అన్న ఎదురుచూపులు పెరిగాయి.    (కొత్త పార్టీ స్థాపన దిశగా అళగిరి)

మరిన్ని వార్తలు