పార్టీల రిజిస్ట్రేషన్‌ రద్దు చేసే పవర్‌ ఇవ్వండి.. న్యాయ శాఖకు ఈసీ వినతి

27 Jun, 2022 09:49 IST|Sakshi

న్యూఢిల్లీ : అవినీతి కార్యకలాపాల్లో ప్రమేయమున్న గుర్తింపులేని రాజకీయ పార్టీల ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌ నడుం బిగించింది. అలాటి రాజకీయ పార్టీలను రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే  అధికారం తమకు కల్పించాలంటూ న్యాయశాఖకు విజ్ఞప్తి చేసింది. 

ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ఎన్నికల సంఘానికి ఒక పార్టీని రిజిస్టర్‌ చేసే అధికారమే ఉంది తప్ప, దానిని రద్దు చేసే అధికారం లేదు. తామరతంపరగా ఎన్నో రాజకీయ పార్టీలు రిజస్టర్‌ అవుతున్నా చాలా పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే దాఖలాలు లేవని, అవన్నీ కేవలం కాగితాలకే పరిమితమై పోతున్నాయని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

అందుకే ప్రజాప్రతినిధ్య చట్టం ద్వారా తమకు ఇలాంటి రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే  అధికారం ఇవ్వాలని కోరారు.   దేశవ్యాప్తంగా 2,800 రిజిస్టర్డ్‌ అన్‌రికగ్నైజ్డ్‌ రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇవికాకుండా.. ఎనిమిది జాతీయ పార్టీలకు, 50 ప్రాంతీయ పార్టీలకు ఈసీ గుర్తింపు ఉంది.

చదవండి: ఢిల్లీ.. ఆ మంటలు ఆర్పేసింది మనిషి కాదు

మరిన్ని వార్తలు