Viral Video: రైల్వేస్టేషన్‌లో ఉత్సాహంగా స్టెప్పులేసిన ప్రయాణికులు.. ఎందుకో తెలుసా!

26 May, 2022 19:10 IST|Sakshi

భోపాల్‌: రైలు ప్రయాణమంటే ఉండే హడావుడి అంతా ఇంత కాదు.. ఎంత ఇంటి నుంచి బయల్దేరినా అప్పుడప్పుడు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సిందే. ఏదో కష్టాలు పడి చివరికి స్టేషన్‌ చేరుకుంటే ట్రైన్‌ ఆలస్యమని అనౌన్స్‌ వినిపిస్తోంది. ఈ సౌండ్‌ చెవికి ఎంత చిరాకుగా ఉంటోందో ప్రతి ఒక్కరికి అనుభవమయ్యే ఉంటుంది. అదే ట్రైన్‌ రావాల్సిన సమయానికి వస్తే ఎంత ఆనందమో.. అచ్చం ఇలాగో ఓ రైలు అనుకున్న సమయం కంటే ముందే వచ్చినందుకు ప్రయాణికులందరూ తెగ సంబరపడిపోయారు. ఆ సంతోషంతో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు.

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకోగా దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాంద్రా-హ‌రిద్వార్ రైలు బుధవారం రాత్రి షెడ్యూల్ సమయానికి 20 నిమిషాల ముందే ర‌త్‌లాం స్టేష‌న్‌కి చేరుకుంది. స్టేషన్‌లో రైలు పది నిమిషాలు ఆగి బయల్దేరుతుంది. దీంతో 30 నిమిషాల సమయం ఉండటంతో ఓ బోగీలోని ప్ర‌యాణికులు గ‌ర్భా డ్యాన్స్ చేయ‌డం ప్రారంభించారు. గుజ‌రాత్ నుంచి కేదార్‌నాథ్ వెళ్తున్న దాదాపు 90 మంది కలిసి ప్లాట్‌ఫాంపై ఎంతో ఆనందంగా డ్యాన్స్‌ చేశారు.
చదవండి: బైక్‌ వెనుక కూర్చొని హెల్మెట్‌ పెట్టుకోవడం లేదా? ఈ వార్త మీకోసమే!

గుజ‌రాత్‌లో అత్యంత పాపులర్‌ పాట‌లు, బాలీవుడ్ పాట‌ల‌పై స్టెప్పులేశారు. చిన్న పిల్లలనుంచి వృద్ధుల వరకు అందరూ కలిసి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. 20 నిమిషాల పాటు బోగీలో కూర్చునే కంటే ఇలా డ్యాన్స్ చేస్తే అల‌స‌ట తీరిపోతుంద‌నే తాము ఇలా చేశామ‌ని ప్ర‌యాణికులు తెలిపారు. ఈ వీడియోను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూ యాప్‌లో షేర్‌ చేశారు. ఇప్పుడిది నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ట్రైన్‌ సమయానికి వస్తే ఇలాగే ఆనందంగా ఉంటుందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు