Narendra Modi: అంబులెన్స్‌కు దారి.. నిలిచిపోయిన ప్రధాని మోదీ కాన్వాయ్‌

9 Nov, 2022 21:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచార పర్వం ముమ్మరంగా సాగుతోంది. మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని బీజేపీ, పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్‌ పోటీపడుతున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో బుధవారం పర్యటించారు. ఈక్రమంలో అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు ఆయన కాన్వాయ్‌ కొద్దిసేపు నిలిచిపోయింది.

అక్కడ ప్రజలు పోగై ప్రధాని మోదీకి చేతులు ఊపుతూ అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంబులెన్స్‌కు లైన్‌ క్లియర్‌ చేసిన తర్వాత కాన్వాయ్‌ తిరిగి కదిలింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కూడా ప్రధానికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. గత నెలలో అహ్మదాబాద్‌ నుంచి గాంధీ నగర్‌ వెళ్తుండగా ఓ అంబులెన్స్‌కు ఆయన కాన్వాయ్‌ దారి ఇచ్చింది.
(చదవండి: క్షమించండి అంటూ నితిన్‌ సంచలన వ్యాఖ్యలు... షాక్‌లో బీజేపీ)

కాంగ్రెస్‌ అభివృద్ధి వ్యతిరేకి
హిమాచల్‌ ప్రదేశ్‌లో అ‍త్యధిక అసెంబ్లీ స్ధానాలున్న కాంగ్రా జిల్లాలో మోదీ పర్యటించారు. చాంబీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... రాష్ట్రానికి బలమైన, స్థిరమైన డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కావాలని అన్నారు. అస్థిరత్వం, అవినీతి, స్కామ్‌ల మయమైన పార్టీలు ఎందుకని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరారు.

సుపరిపాలన అందించేవారికి ప్రజలెప్పుడూ పట్టం కడతారని ఆకాక్షించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాకూడా కాంగ్రెస్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ను పట్టించుకోలేదని అన్నారు. వారు అభివృద్ధికి వ్యతిరేకులు అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇక 68 అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబరు 12న జరుగనున్నాయి. డిసెంబర్‌ 8వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. 
(చదవండి: మోదీతో 25 ఏళ్ల పరిచయం.. అయినా వెనక్కి తగ్గను)

మరిన్ని వార్తలు