Viral Video: ఉన్నట్టుండి చేతిపంపు నుంచి మంటలు, ఆ వెంటనే నీరు.. ఆందోళనలో స్థానికులు!

25 Aug, 2022 21:18 IST|Sakshi

ప్రకృతిలో వింతలు, విడ్డూరాలకు కొదవుండదు. అప్పటిదాకా మామూలుగానే ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా పూర్తి భిన్నంగా మారిపోతుంటాయి. అంతా తమకు తెలిసే జరుగుతుందనుకునే మనిషి ఆ ఊహించని ఘటనలతో ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు.

తాజాగా మధ్యప్రదేశ్‌లోని బుక్సువా బ్లాక్‌, కచ్చర్‌ గ్రామస్తులకు అలాంటి వింతైన అనుభవమొకటి కలిగింది. చేతిపంపులో నుంచి ఒక్కసారిగా భారీ మంటలు ఆ వెంటనే నీళ్లు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆ చుట్టుపక్కల ఉన్నవారు పరుగులు పెట్టారు. అలా చాలా సేపు కొనసాగడంతో ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌ కెమెరాల్లో బంధించారు కొందరు. దీంతో వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 
(చదవండి: స్టూడెంట్ రిపోర్టింగ్‌కు సోనూసూద్‌ ఫిదా.. నీ కోసం కొత్త స్కూల్‌ రెడీ అంటూ..)

బుధవారం సాయంత్రం ఈ ఘటన వెలుగుచూసింది. నమ్మశక్యంగాని ఘటనతో స్థానికులు ఎవరికి వారు ఊహించుకున్నారు. తమ కళ్లను అస్సలు నమ్మలేక పోతున్నామని కొందరు అంటుండగా.. కెమికల్‌ లీక్‌ వల్లే ఇలా జరిగిందని మరికొందరు చెప్తున్నారు. ఈనేపథ్యంలో స్థానిక నేతలు కొందరు చత్తర్‌పూర్‌ జిల్లా అధికారులకు సమాచారం అందించారు. 

ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు భూమి లోపలి పొరల్లోంచి మీథేన్‌ వాయువు వెలువడటంతో మంటలు చెలరేగాయని తెలిపారు. భోపాల్‌ ప్రభుత్వ సైన్స్‌ కాలేజీకి చెందిన డాక్టర్‌ జ్ఞానేంద్ర ప్రతాప్‌ సింగ్‌ మాట్లాడుతూ.. బుక్సువా ప్రాంతంలోని భూమి పొరల్లో వృక్ష, జంతు వ్యర్థాలు పెద్ద ఎత్తున పోగుపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఈక్రమంలోనే రసాయన చర్య కారణంగా మీథేన్‌ వాయువు మండుతూ పైకి చొచ్చుకొచ్చిందని, దాంతోపాటు నీరు కూడా పైకి ఎగజిమ్మిందని చెప్పుకొచ్చారు.
(చదవండి: అంబులెన్స్‌ రాలేదు.. జేసీబీతో గర్భిణి ఆస్పత్రికి తరలింపు: వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు