న్యూఢిల్లీ: బండి నడిపే వాళ్లకు హెల్మెట్ తప్పనిసరితో పాటు వెనకాల కూర్చునే వాళ్లకు సైతం హెల్మెట్ తప్పనిసరి నిబంధనలు చాలా చోట్ల అమలు అవుతున్నాయి. అయితే హెల్మెట్ విషయంలో మోటార్ వెహికిల్స్ యాక్ట్ కొత్త సవరణను కఠినంగా అమలు చేయబోతోంది. తేడాలొస్తే.. జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ మీద వేటు తప్పదని స్పష్టం చేసింది.
నాణ్యత ప్రమాణాలు లేని హెల్మెట్లు ధరించినా ఫైన్ మోత తప్పదు ఇక నుంచి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్, ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లపై తప్పక ఉండాల్సిందే. పూర్తిస్థాయిలో రక్షణ కలిగించే హెల్మెట్లు మాత్రమే.. అదీ సర్టిఫైడ్ అయ్యి ఉండాలి. అలా లేకుంటే.. మోటర్ వెహికిల్స్ యాక్ట్ 1988 లోని సెక్షన్ 129 ఉల్లంఘనల కింద సెక్షన్-194డీ ప్రకారం.. వెయ్యి రూపాయల ఫైన్తో పాటు మూడు నెలలపాటు లైసెన్స్పై వేటు వేస్తారు.
ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లను మాత్రమే టూవీలర్స్పై ఉపయోగించడం తప్పనిసరి చేస్తూ జూన్ 1, 2021లో ఆదేశాలు జారీ అయ్యాయి. నాన్-ఐఎస్ఐ హెల్మెట్లను బ్యాన్ చేసినా.. ఇప్పటికీ చాలామంది వాటినే ఉపయోగిస్తుండడం గమనార్హం.