వచ్చేస్తుంది వెబ్‌ 3.0.. 2023 చివరికల్లా తుదిరూపం..! ఏం జరగబోతోంది? 

17 Jan, 2023 01:41 IST|Sakshi

ఆంక్షల్లేని నెట్‌ ప్రపంచం బ్లాక్‌ చైన్, కృత్రిమమేధ, మెషీన్‌ లెర్నింగ్‌తో సరికొత్త వెబ్‌ ప్రపంచం 

నియంత్రణ లేని స్వేచ్ఛాయుత డిజిటల్‌ వాతావరణం 

చట్టాలు, ఆంక్షలకు కాలం చెల్లబోతున్నాయి 

బడా కంపెనీల పెత్తనం ఇక సాధ్యంకాదు

దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (వరల్డ్‌ వైడ్‌ వెబ్‌) ఇంటర్‌నెట్‌ ప్రపంచానికి గుర్తింపు కార్డు. వెబ్‌ మొదలైనప్పటికీ ఇప్పటికీ పోలికే లేనంతగా మారిపోయింది. చదవడానికి, రాయడానికి, సమాచారాన్ని పంచుకోవడానికి వేదిక అయిన ఈ వెబ్‌ త్వరలో మరో అవతారం ఎత్తబోతోంది. మరింత స్వేచ్ఛాయుతంగా, ఆంక్షలులేని, అనుమతులు అవసరంలేని సరికొత్త వెబ్‌ ఆవిష్కృతం కాబోతోంది.

వెబ్‌ పరిణామ క్రమాన్ని మూడు అంచెలుగా చెప్తున్నారు. తొలినాటి వెబ్‌ను వెబ్‌ 1.0గా, ప్రస్తుతం నడుస్తున్నదాన్ని వెబ్‌ 2.0గా రాబోయేదానిని వెబ్‌ 3.0గా పిలుస్తున్నారు. దీనిని సినిమాలతో పోలిస్తే.. వెబ్‌ 1.0 అంటే బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా అయితే వెబ్‌ 2.0 రంగుల చిత్రం, అదే వెబ్‌ 3.0 ఏకంగా త్రీడీ సినిమా అనుకోవచ్చు. మరి వెబ్‌ పుట్టు పూర్వోత్తరాలు, దాని పరిణామం, రాబోయే రోజుల్లో ఏ విధంగా మారబోతున్నదో తెలుసుకుందాం. 

వెబ్‌ 3.0 
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి నిరంతరంగా సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే వెబ్‌ 3.0 తెరపైకి వస్తోంది. ఇది ఎప్పుడు మొదలవుతుందో కచ్చితంగా చెప్పలేకున్నా.. ప్రస్తుత పరిణామాల ఆధారంగా 2023 చివరికల్లా వెబ్‌ 3.0 ఒక రూపుదాల్చుతుందని సాంకేతిక పరిజ్ఞాన నిపుణుల అంచనా. ఎవరి నియంత్రణ అవసరం లేకుండా బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ఆధారంగా రూపొందిన క్రిప్టోకరెన్సీలే వెబ్‌ 3.0కు తొలి అడుగుగా వారు చెప్తున్నారు.

గత వెబ్‌ వెర్షన్లకు రాబోయే 3.0కు ఉన్న ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే.. రాబోయేది నియంత్రణలు లేని స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయడమే. వెబ్‌ 3.0 మౌలిక నిర్మాణంలో పెద్దగా మార్పు లేకపోయినా.. నూతన సాంకేతిక పరిజ్ఞానాల కారణంగా దీని స్వభావాలు సమూలంగా మారబోతున్నాయి. ప్రస్తుతం వెబ్‌ వివిధ కంపెనీల నియంత్రణలో నడుస్తుండగా.. వెబ్‌ 3.0 పూర్తి స్వేచ్ఛా వాతావరణంలో పనిచేయబోతోంది.

దీనికోసం బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీతోపాటు కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి టెక్నాలజీలు వెబ్‌కు జత అవుతున్నాయి. ప్రస్తుతం ఒకటి లేదా రెండు సర్వర్ల ఆధారంగా ఇంటర్నెట్‌ సమాచార మార్పిడి జరుగుతోంది. వీటిపై కార్పొరేషన్లు, ప్రభుత్వాల నియంత్రణ ఉంటోంది. సమాచార మార్పిడి ఐపీ అడ్రస్‌ల ఆధారంగా జరుగుతోంది.

వీటికి అనుమతించడం, నియంత్రించడం ఆయా సర్వర్లపై పెత్తనం ఉన్న కంపెనీలు, ప్రభుత్వాలకే ఉంది. రాబోయే వెబ్‌ 3.0 సరికొత్త ఈ నియంత్రణలకు లొంగకుండా పనిచేస్తుంది. కంపెనీలు, ప్రభుత్వాల ఆధారంగా కాకుండా వినియోగించే వారి నియంత్రణలో పనిచేసే విధంగా ఉంటుంది. యూజర్‌ కోరే సమాచారాన్ని కృత్రిమమేధ ద్వారా ప్రపంచంలో ఏ సర్వర్‌లో ఉన్నా తీసుకునే హక్కు రాబోతోంది.

వెబ్‌ 1.0 
యూరప్‌ పరిశోధన సంస్థ ‘సెర్న్‌’లో కంప్యూటర్‌ సైంటిస్టుగా పనిచేసిన బెర్నర్స్‌లీ 1990లో వెబ్‌ను రూపొందించారు. వెబ్‌కు అవసరమైన ప్రాథమిక సాంకేతిక పరిజ్ఞానమైన హెచ్‌టీఎంఎల్, యూఆర్‌ఎల్, హెచ్‌టీటీపీల రూపకర్త బెర్నర్స్‌లీ. తొలి వెబ్‌పేజీని కూడా ఆయనే ఆవిష్కరించారు. తొంబై దశకం మొత్తంగా సాగిన ఈ తొలినాటి వెబ్‌లో కేవలం ఒక కంప్యూటర్‌ నుంచి మరో కంప్యూటర్‌కు వెబ్‌ పేజీల ద్వారా సమాచారం పంపడానికి మాత్రమే వీలయ్యేది.

నెట్‌స్కేప్‌ వంటి వెబ్‌బ్రౌజర్‌ల ద్వారా ఈ–మెయిల్స్‌ పంపుకొనేవారు. ఇంటర్నెట్‌లో చాలా పరిమితంగా సమాచారం అందుబాటులో ఉండేది. రీడ్‌ఓన్లీగా పిలిచే ఈ వెబ్‌ 1.0 దాదాపుగా 1990లో మొదలై 2004 వరకు సాగింది. వెబ్‌ 1.0 చివరి రోజుల్లో క్రమంగా రూపాంతరం చెందుతూ వెబ్‌ 2.0 ఆవిర్భావానికి బాటలు వేసింది. 

వెబ్‌ 2.0 
ప్రస్తుతం మనకు సుపరిచయమైన వెబ్‌ వెర్షన్‌ ఇది. తొలినాటి వెబ్‌కు ఏమాత్రం పోలికలేని స్థాయిలో మార్పు చెంది వెబ్‌ 2.0గా రూపుదాల్చింది. స్థిరమైన వెబ్‌ నుంచి అత్యంత వేగవంతమైన క్రియాశీల అప్లికేషన్‌గా అవతరించింది. చదవడానికి పరిమితమైన వెబ్‌పేజీల నుంచి చదవడం, రాయడం, పరస్పరం సంభాషించుకోగలడం వంటివాటికి వేదికైంది. అపార జ్ఞాన సంపదకు భాండాగారంగా మారింది.

సోషల్‌ మీడియా నుంచి డిజిటల్‌ కరెన్సీ వరకు అన్ని రంగాలను ప్రభావితం చేసింది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఫ్లిక్కర్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్‌ వంటి అనేకానేక సోషల్‌ మీడియా వెబ్‌సైట్లకు వెబ్‌ 2.0 పునాది అయింది. సమస్త సమాచారాన్ని ముంగిటకు తెచ్చి.. ప్రపంచ ప్రజల జీవనశైలినే మార్చేసింది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, మొబైల్‌ బ్యాంకింగ్, ఏటీఎం వంటి అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.

క్రిప్టోకరెన్సీ వంటి డిజిటల్‌ కరెన్సీ చలామణీలోకి రావడానికి కూడా వెబ్‌ 2.0 తోడ్పడింది. వినోద రంగంలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌ లాంటి వేల ఓటీటీ చానెల్స్, స్ట్రీమింగ్‌ సైట్ల పుట్టుకకు ఆస్కారం కల్పించింది. వెబ్‌ సాంకేతిక పరిజ్ఞానాలైన హెచ్‌టీఎంఎల్‌5, సీఎస్‌ఎస్‌3, జావా స్క్రిప్ట్‌ ఆధారంగా రోజురోజుకు కొత్త ఆవిష్కరణలతో గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్‌ వంటి వందల కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యాల సృష్టిని సాకారం చేసింది. ఇప్పుడు బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీతో 2.0 మరో అవతారం ఎత్తడానికి సమాయత్తం అవుతోంది. 

కచ్చితత్వం దిశగా.. 
ఈ సరికొత్త సాంకేతికత వల్ల వినియోగదారుడికి కచ్చితమైన సమాచారం అందే అవకాశాలు పెరగనున్నాయి. యూజర్‌ ఏదైనా సమాచారం కొరితే.. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష అంశాలన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో నిర్ణయించుకునే ఆస్కారం లేకుండాపోతోంది. 

ఇక మీద ఏదైనా సమాచారం కోరినప్పుడు వెబ్‌ 3.0లోని కంప్యూటర్‌ సమాచారం కోరిన నేపథ్యాన్ని కూడా అర్థం చేసుకుని, వాస్తవికతను జోడించి అవసరమైన మేరకే కచ్చితమైన సమాచారాన్ని అందించగలుగుతుంది. ఇక ముందు కంపెనీలన్నీ ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను పొందుపర్చగల కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు, ఇతర ఉత్పత్తులను తీసుకురానున్నాయి. ఈ పరిజ్ఞానం ఆధారంగా పనిచేయబోయే యాప్‌లను కూడా డీయాప్స్‌ (డీసెంట్రలైజ్డ్‌ యాప్స్‌)గా పిలవబోతున్నారు. 

ఏం జరగబోతోంది? 
►వెబ్‌ 3.0 యుగంలో మనకు నియంత్రిత సమాచారం నుంచి విముక్తి లభిస్తుంది. కోరుకున్న సమాచారం కచ్చితత్వంతో, ఎవరి ప్రమేయానికి లోనవకుండా అందుబాటులోకి వస్తుంది. మన వ్యక్తిగత వివరాలపై ఎవరి నియంత్రణ ఉండబోదు. విస్తృతమైన డేటా బేస్‌ ఉన్న ఫేస్‌బుక్, గూగుల్‌ వంటి కంపెనీలు ఇకముందు ఆ డాటాబేస్‌పై నియంత్రణ కోల్పోతాయి. 

►కొత్త వెబ్‌లోని సమాచారంపై ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థలకు నియంత్రణ సాధ్యం కాదు. ప్రభుత్వ సెన్సార్‌షిప్‌లు పనిచేయవు. ఇప్పటికే సైబర్‌ క్రైంను అదుపు చేయడానికి అష్టకష్టాలు పడుతున్న పోలీసు వ్యవస్థకు దీనితో మరిన్ని కష్టాలు వచ్చే అవకాశముంది. 

►డిజిటల్‌ సమాచారానికి సంబంధించిన ఆయా దేశాల చట్టాలను అమలు చేయడం కూడా సాధ్యం కాదు. ఇదివరకు కొన్ని సర్వర్ల ద్వారా సమాచార మార్పిడి జరిగేది. వాటి నియంత్రణ ద్వారా ప్రభుత్వాలు, పోలీసులు, కోర్టులు చట్టాలను అమలు చేయగలిగేవి. కొత్త వెబ్‌లో సమాచారం అనేక కేంద్రాల నుంచి లభించడం వల్ల.. దానిపై పెత్తనం అసాధ్యంగా మారబోతోంది. మారబోయే సరికొత్త సాంకేతిక వాతావరణంలో ప్రభుత్వాలు, చట్టాలను అమలు చేసే వ్యవస్థలు తమ పంథా మార్చుకోవలసిన పరిస్థితి రానుంది. 

మరిన్ని వార్తలు