గుంపులుగా చేరి.. బాణాసంచా పేల్చి కార్యకర్తల హడావుడి

31 Jul, 2020 15:23 IST|Sakshi

చెన్నై: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో సామాజిక దూరం పాటించడం, మాస్క్‌ ధరించడం వంటి జాగ్రత్తలు పాటిస్తే.. మనతో పాటు మన చుట్టూ ఉన్నవారి ఆరోగ్యాన్ని కాపాడినవారం అవుతామంటూ ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినా కొందరు మాత్రం వీటిని అస్సలు పట్టించుకోవడం లేదు. అత్యుత్సాహం ప్రదర్శించి.. వారితో పాటు ఇతరులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సామాన్య జనం అనుకుంటే నాయకులు కూడా ఇలానే ఉన్నారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి తాజాగా మధురైలో చోటు చేసుకుంది. కరోనా నుంచి కోలుకుని వస్తోన్న తమ నాయకుడి కోసం కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. సామాజిక దూరాన్ని పాటించకుండా గుంపులుగా చేరి.. బాణాసంచా పేల్చుతూ.. హడావుడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. (తల్లికి కరోనా.. బుద్ధిమాద్యం కొడుకు కోసం)

అసలే తమిళనాడులో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఇలాంటి సమయంలో ఈ తలతిక్క పనులు ఏంటని నెటిజనులు కార్యకర్తలతో పాటు సదరు నాయకుడి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. తమిళనాడు మినిస్టర్‌ సెల్లూరు రాజుకు కొంతకాలం క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆయన చెన్నైలోని ఎంఐఓటీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. వైరస్‌ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఏఐఏడీఎంకే కార్యకర్తలు తమ నాయకుడికి స్వాగతం చెప్పడానికి భారీ సంఖ్యలో గుమి కూడారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి.. హడావుడి చేశారు. సామాజిక దూరం పాటించలేదు. కొందరు సెల్ఫీ దిగేందుకు కూడా ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏఎన్‌ఐ ట్విట్‌ చేసింది. దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకులే ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. (లాక్‌డౌన్ : త‌మిళ‌నాడు కీల‌క నిర్ణ‌యం

కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తమిళనాడులో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ విధించింది. భారీ ఊరేగింపులు వంటి కార్యక్రమాలను నిషేధించింది. కానీ ఏఐఏడీఎంకే కార్యకర్తలు ఈ ఆదేశాలను పట్టించుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శిచారు. ప్రస్తుతం తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య2, 39, 978 కాగా యాక్టీవ్‌ కేసుల సంఖ్య 1,78, 178. మరణాల సంఖ్య 3, 838కి చేరింది.

మరిన్ని వార్తలు