బెంగాల్‌ హింస పిటిషన్‌: అనూహ్యంగా తప్పుకున్న జడ్జి

19 Jun, 2021 14:16 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై బాధితుల తరపున సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యవహరంలో నిన్న(శుక్రవారం) ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. పిటిషన్‌లో వాదనలు వినాల్సిన జడ్జి తనంతట తానుగా తప్పుకున్నట్లు ప్రకటించారు. 

‘‘ఈ కేసును విచారణ చేపట్టేందుకు నేను సిద్ధంగా లేదు. వ్యక్తిగతంగా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తోంది. అందుకే తప్పుకోవాలని నిర్ణయించుకున్నా’’ అని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆమె బెంగాల్‌కు చెందిన వ్యక్తే.  ఇక ఈమె తప్పుకోవడంతో ఈ కేసు మరో బెంచ్‌కు బదిలీ చేసే అవకాశం ఉంది.

కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింస దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరుతూ బాధితుల కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. మరోవైపు మమతా బెనర్జీ సర్కార్‌ మాత్రం ఇవి రాజకీయ ఉద్దేశాలతో దాఖలు చేసిన పిటిషన్‌గా పేర్కొంటూ కొట్టివేయాలని సుప్రీంను కోరుతోంది. అంతేకాదు ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపింది.  

అయితే ఈ అభ్యర్థనపై సరైన వివరణ ఇవ్వాలని సుప్రీం బెంగాల్‌ సర్కార్‌ను ఆదేశించింది. మరోవైపు ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ప్రతీ ఘటనను ఎన్నికల హింసకు ఆపాదించడం సరికాదని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వి​జ్ఞప్తి చేస్తోంది. మరోవైపు గ్యాంగ్‌ రేప్‌నకు గురైన ఓ దళిత బాలిక, వృద్ధురాలి తరపున ఘటనలపై సిట్‌ లేదా సీబీఐ విచారణ జరిపించాలనే పిటిషన్‌ దాఖలు అయ్యాయి.

చదవండి: బెంగాల్‌ హింస ఆగేది ఎన్నడో?

మరిన్ని వార్తలు