బెంగాల్‌లో హింసాత్మకం: బీజేపీ కార్యకర్త హత్య

27 Mar, 2021 14:40 IST|Sakshi

కోల్‌కత్తా: అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్‌ శనివారం మొదలైంది. పశ్చిమ బెంగాల్‌లో 30 అసెంబ్లీ స్థానాలకు తొలి దశలో భాగంగా ఎన్నికలు జరుగుతున్నాయి. చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల వేళ రాజకీయ దాడులు జరిగాయి. ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ బీజేపీ కార్యకర్త హత్యకు గురవగా మరోచోట బీజేపీ నాయకుడు కారుపై దాడి జరిగింది. కారును ధ్వంసం చేయడంతో పాటు ఆ నాయకుడిపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారు.

పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లాలోని కేశియారి ప్రాంతంలో బీజేపీ కార్యకర్త మంగల్‌ సోరెన్‌ (35) దారుణ హత్యకు గురయ్యాడు. పుర్బా మేదినిపూర్‌ జిల్లా సత్సతామల్‌ నియోజకవర్గంలో ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద కాల్పులు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా ఇద్దరు భద్రతా సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కొంటై నియోజకవర్గంలోని బీజేపీ సీనియర్‌ నాయకుడు సువేందు అధికారి సోదరుడు సౌమెందు అధికారి కారుపై దాడి జరిగింది. అతడి కారును అడ్డగించి ధ్వంసం చేశారు. కారు డ్రైవర్‌పై దాడి చేశారు. అయితే ఈ దాడి నుంచి సౌమెందు అధికారి సురక్షితంగా బయటపడ్డాడు.

మరిన్ని వార్తలు