బెంగాల్‌లో కోవిడ్‌ టీకా సర్టిఫికెట్‌పై మమత ఫొటో

6 Jun, 2021 06:23 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కోవిడ్‌ టీకా సర్టిఫికెట్‌లపై సీఎం మమతా బెనర్జీ ఫొటో ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో 18–44 ఏళ్ల వయసు వారు కోవిడ్‌ టీకాలు తీసుకుంటే వారికి సీఎం ఫొటో ఉన్న కోవిడ్‌ టీకా సర్టిఫికెట్‌ను ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్‌ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫొటో ఉండగా, బెంగాల్‌లో మమత ఫొటో ఉండటంపై బీజేపీ వర్గాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఈ అంశంపై బెంగాల్‌ రాష్ట్ర మంత్రి ఫిర్హాద్‌ హకీమ్‌ వివరణ ఇచ్చారు. ‘ మా రాష్ట్రంలో 18–44 ఏళ్ల వయసు వారికి ఇస్తున్న టీకాలు.. కేంద్ర ప్రభుత్వం సరఫరాచేసినవి కాదు. బెంగాల్‌ ప్రభుత్వం సొంత ఖర్చుతో టీకా తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేస్తోంది. కేంద్రప్రభుత్వమేమీ 18–44 ఏళ్ల వయసు వారి టీకాలు ఇవ్వట్లేదు కదా? అయినా, మమత ప్రభుత్వం ఇస్తోందికాబట్టే ఆమె ఫొటోను టీకా సర్టిఫికెట్లపై ముద్రించాం.  పంజాబ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ ప్రభుత్వాలూ తమ సీఎంల ఫొటోలున్న సర్టిఫికెట్లనే జారీచేస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు