పవర్‌ ఆఫ్‌ సోషల్‌ ‘మీడియా’.. ఆ సామాన్యుడి ‘మొరుగుడు’ నిరసన ఫలించింది

21 Nov, 2022 15:02 IST|Sakshi

కోల్‌కతా: సోషల్‌ మీడియా నుంచి మీడియాకు ఎక్కిన ఆ సామాన్యుడి నిరసనకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. ‘భౌ.. భౌ..’అంటూ బాధితుడు చేసిన పనికి.. అధికార యంత్రాంగం దిగొచ్చింది.  

పశ్చిమ బెంగాల్‌కు చెందిన శ్రీకాంతి కుమార్‌ దత్తా అనే వ్యక్తి చేపట్టిన వినూత్న నిరసన గురించి దేశవ్యాప్త చర్చ నడిచిన సంగతి తెలిసిందే. రేషన్‌ కార్డులో పేరు సవరణ కోసం ఆయన మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నారట. మూడవ సారికి స్పందించిన అధికారులు ఆయన ఇంటిపేరు ‘దత్తా’ కాగా.. రేషన్‌ కార్డులో కుత్తా(కుక్క) అని తప్పుగా అచ్చువేశారు. ఇక లాభం లేదనుకున్న ఆయన.. కుక్కలా మొరుగుతూ నిరసనను అధికారుల వద్ద తెలియజేశారు.

ఆ సమయంలో ఆ అధికారి ఒకింత ఇబ్బందికి గురి కావడం చూడొచ్చు. మొత్తానికి వీడియో ప్రభావంతో.. సమస్య తెలుసుకున్న బీడీవో రేషన్‌ కార్డులో పేరును సవరించాలని సిబ్బందిని ఆదేశించారు. సోషల్‌ మీడియా నుంచి మీడియాకి ఎక్కడంతో.. విమర్శలపాలు కావడం ఇష్టంలేని అధికారులు సత్వరం స్పందించారు. సోమవారం ఆయన పేరును కుత్తా నుంచి దత్తాకి మార్చేస్తూ రేషన్‌ కార్డును చేతిలో పెట్టారు.

మరిన్ని వార్తలు