‘నా ఫోన్‌ను ట్యాప్‌ చేశారు’: ముఖ్యమంత్రి

18 Apr, 2021 01:59 IST|Sakshi

ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశిస్తా: మమతా బెనర్జీ

గల్సీ (పశ్చిమ బెంగాల్‌): పోలింగ్‌ బూత్‌ వద్ద భద్రతా బలగాల కాల్పుల తర్వాత ఆ మృతదేహాలతో ర్యాలీ చేపట్టాలని తాను ఆదేశించానని చెబుతున్న ఆడియో టేప్‌ వివాదంపై పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ‘నా ఫోన్‌ను ట్యాప్‌ చేశారు. ఈ మొత్తం వివాదంపై నిజానిజాలు రాబట్టేందుకు సీఐడీ విచారణకు ఆదేశిస్తాను’ అని మమత ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గల్సీలో జరిగిన సభలో మమత ప్రసంగించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పోల్చుకుంటే తృణమూల్‌ కాంగ్రెస్‌తో ఏ పార్టీ సాటిరాలేదని మమత వ్యాఖ్యానించారు.

‘వంట చేస్తున్నామా.. ఇంటి పని చేస్తున్నామా అనేది సహా మా దినచర్య మొత్తం మీద బీజేపీ నిఘా పెట్టింది అని ఆరోపించారు. అయితే ఈ కుట్రలో మా పాత్ర లేదు అని బీజేపీ చెబుతోంది. మరోవైపు ఈ ఆడియో టేప్‌ వివాదంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ స్పందించింది. ‘ఆ ఆడియో టేప్‌ నకిలీది. అలాంటి సంభాషణ జరగనే లేదు. అయినా, కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్‌ ట్యాప్‌ చేయడం ఆశ్చర్యంగా ఉంది’ అని టీఎంసీ వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు