పంద్రాగస్టు వేడుకలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

15 Aug, 2020 08:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నేడు భారత్‌ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. పంద్రాగస్టు అనగానే ఢిల్లీ నుంచి గల్లీ దాకా పండగే.. ఎక్కడ చూసిన మువ్వనెల జెండా రెపరెపలాడుతూ కనిపిస్తోంది. భారతీయుల గుండెల్లో దేశభక్తి పరవళ్లు తొక్కుతోంది. నా దేశానికి ఏ హాని జరగకుండా కాపాడుకుంటామని.. మాతృభూమికి ఆపద వస్తే రక్షించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతామనే ధృడ సంకల్పం ప్రతి భారతీయునిలో కనిపిస్తోంది. ప్రతి ఏడాది ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరగుతాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్‌ఎస్‌జీ స్నైపర్లు, స్వాట్‌ కమాండోలతో క‌ట్టుదిట్ట‌మైన‌ భద్రతా ఏర్పాట్లు చేశారు. (స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సన్నద్ధం)

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఈ రోజుఉదయం 7.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 350 మంది పోలీసులు మాత్రమే పాల్గొనున్నారు. ఎర్రకోట వద్ద పంద్రాగస్టు వేడుకలకు 4 వేల మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ప్రతి ఇద్దరి మధ్య రెండు యార్డుల దూరం ఉండేలా కుర్చీల ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గతంలో ఇక్కడ జరిగే స్వాతంత్ర దినోత్స వేడుకలకు దాదాపు 30 వేల మంది పాల్గొనేవారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించే స్వాతంత్ర్య వేడుకలకు వీవీఐపీలు కేవలం 20 శాతం మంది మాత్రమే హాజరు కానున్నారు. ఎర్రకోట సమీపంలో నాలుగు కోవిడ్-4 టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. పంద్రాగస్టు వేడుకలకు హాజరయ్యే వారిలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఈ కేంద్రాల్లో వారికి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు.

అలాగే దేశంలోని అన్ని చోట్లా నేడు పంద్రాగస్టు వేడుకలు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాదాసీదగా నిర్వహిస్తున్నారు. జెండా ఆవిష్కరణ వేడుకలకు కొద్ది మంది మాత్రమే పాల్గొననున్నారు. నేడు పంద్రాగస్టు వేడుకలు ప్రగతి భవన్‌లోనే జరగనున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉదయం 10.15 గంటలకు మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరిస్తారు. కొవిడ్‌-19 నిబంధనలకు లోబడి ఉత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్వాతంత్య్ర వేడుకల్లో 20 మంది అతిథులు మాత్రమే పాల్గొననున్నారు. రాష్ట్రంలోని ప్రతి చోట స్వాతంత్ర్య సంబురాలు జ‌రుపుకోవాల్సిన నిబంధనలను తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

► ప్రతి చోట భౌతిక దూరం పాటించేలా  ఏర్పాట్లు 

► ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కు ధరించాల్సిందే..

► ప్రతి చోట శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచారు.

►  వేడుకల్లో పాల్గొనే వారికి 50 మందికి మించరాదు.

 20 నిమిషాల్లో వేడుకను పూర్తి చేయాలి.

►  సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరాదు.

>
మరిన్ని వార్తలు