అస్సాం సరే.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడు?  విభజన చట్టంలో ఏం చెప్పారు?

28 Dec, 2022 09:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అస్సాం అసెంబ్లీ, పార్లమెంటరీ స్థానాల పునర్విభజన షురూ అయ్యింది. కేంద్ర న్యాయశాఖ వినతి మేరకు ఎన్నికల సంఘం పునర్విభజన కసరత్తు ప్రారంభించింది. 2001 జనాభా లెక్కల ప్రకారం చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పునర్విభజన పూర్తి అయ్యేంతవరకు నూతన అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లపై నిషేధం విధించింది. తన సొంత విధానాల ప్రకారం పునర్విభజన ప్రక్రియను ఈసీ చేపట్టనుంది. ఆర్టికల్ 170 కింద నియోజకవర్గాల పునర్విభజన చేయనుంది. అస్సాంలో 1976లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పుడు 1971 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నారు. అస్సాంలో 14 లోక్‌సభ, ఏడు రాజ్యసభ, 126 అసెంబ్లీ సీట్లున్నాయి.

అస్సాం సరే.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడు? విభజన చట్టంలో ఏం చెప్పారు?. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పుర్విభజనను కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు పక్కనపెట్టింది? వంటి అంశాలపై ఈ క్రమంలో చర్చ నడుస్తోంది. 2014 ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 26లో ఏపీలోని అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కి, తెలంగాణ సీట్లను 119 నుంచి 153కి పెంచాలని ఉంది. ఈ ప్రక్రియను రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170 కింద పొందుపరిచిన నిబంధనలను లోబడి చేపట్టాలని స్పష్టం చేశారు.

సెక్షన్ 26: నియోజకవర్గాల పునర్విభజన
రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కు లోబడి నూతనంగా ఏర్పడే రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు ఈ విధంగా ఉంటుంది
ఆంధ్రప్రదేశ్: 175 నుంచి 225కు
తెలంగాణ: 119 నుంచి 153కు
నోట్: 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన (సీట్ల పెంపు) ఉండదని ఇటీవలే కేంద్రం స్పష్టం చేసింది.
సెక్షన్ 27: నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వులను ఎప్పటికప్పుడు నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి గల అధికారాలు
సెక్షన్ 28: షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వు - 1950కు సవరణ (చట్టంలోని 5వ షెడ్యూల్ పేర్కొన్న విధంగా)
సెక్షన్ 29: షెడ్యూల్డ్ తెగల ఉత్తర్వు - 1950కు సవరణ(చట్టంలోని 6వ షెడ్యూల్ పేర్కొన్న విధంగా)

ఇదిలా ఉండగా, రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అయినా పలు సమస్యలు అపరిష్కృతంగా ఉండటంపై  ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గట్టిగా తన వాణిని వినిపించిన సంగతి తెలసిందే. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి, విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై త్వరగా ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను ఏపీ ప్రభుత్వం కోరింది.
చదవండి: కథ.. ​స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం యనమల.. ఆ లీకుల వెనుక అసలు వ్యూహం ఇదే..

మరిన్ని వార్తలు