‘చైనా పే చర్చ’ ఎప్పుడు ?

18 Dec, 2022 05:54 IST|Sakshi

 మోదీకి ఖర్గే సూటి ప్రశ్న

న్యూఢిల్లీ: ఛాయ్‌ పే చర్చా అంటూ ప్రతీసారి మాట్లాడే ప్రధాని మోదీ.. కీలకమైన చైనా అంశంపై ‘చైనా పే చర్చ’ ఎప్పుడు నిర్వహిస్తారంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిలదీశారు. ‘అరుణాచల్‌లో వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనికుల చొరబాటు యత్నంతో దేశ ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించి వారిలో విశ్వాసం పాదుకొల్పేలా ఎప్పుడు మాట్లాడతారు ? అని ప్రధాని మోదీకి ఖర్గే సూటి ప్రశ్నవేశారు.

‘ దేశ ప్రధాన భూభాగంతో ఈశాన్య రాష్ట్రాలను కలిపే సింహద్వారం ‘సిలిగురి కారిడార్‌’ భద్రతకు మరింత ముప్పు వాటిల్లేలా చైనా డోక్లామ్‌లో శాశ్వత నిర్మాణాలు పూర్తిచేసినట్లు వార్తలొచ్చాయి. డోక్లామ్‌ నుంచి జంపేరీ రిట్జ్‌ వరకు నిర్మాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది దేశ భద్రతను మరింత ప్రమాదంలోకి నెట్టేయడమే. ఇలాంటి కీలక తరుణంలో ‘చైనా పే చర్చ’ ఎప్పుడు నిర్వహిస్తారు?’ అని ఖర్గే శనివారం ట్వీట్‌చేశారు. కాగా, ప్రధాని వీటికి సమాధానాలు చెప్పాల్సిందేనంటూ కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ పలు ప్రశ్నలు ట్వీట్‌చేశారు.
1. తూర్పు లద్దాఖ్‌లో 2020 జూన్‌ 20న భారత భూభాగంలోకి చైనా చొరబడలేదని ఎందుకు చెప్పారు ?
2. 2020 మే నెల ముందువరకు అక్కడి వేలాది కి.మీ.ల విస్తీర్ణంలో పహారా కాసే మన సేనలను ఆ తర్వాత చైనా సైన్యం అడ్డుకుంటే మీరేం చేశారు ?
3. కేబినెట్‌ ఆమోదించిన ‘పర్వతప్రాంత మెరుపు దాడి దళం’ కార్యరూపం ఎందుకు దాల్చలేదు?

మరిన్ని వార్తలు