‘ ప్లీజ్‌.. నా భర్తను భారత్‌ జైలుకు తరలించండి’ 

3 Jul, 2021 10:18 IST|Sakshi

– హైకోర్టులో భార్య పిటిషన్‌

చెన్నై: శ్రీలంక జైలులో ఉన్న తన భర్తను దయచేసి భారత్‌ జైలుకు మార్చాలని కోరుతూ మదురై హైకోర్టు బెంచ్‌లో రీఫాయుదీందన్‌ జాలరి భార్య పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై  కేంద్ర ప్రభుత్వం బదులివ్వాలని బెంచ్‌ ఉత్తర్వులిచ్చింది. రామనాథపురం జిల్లా ఎస్పీ పట్టణానికి చెందిన మెహరూన్‌ నిషా మదురై హైకోర్టు బెంచ్‌లో ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌లోని వివరాల మేరకు.. తన భర్త రీఫాయుదీందన్‌ జాలరి అని, అతను మత్తుమందు తరలించినట్లు శ్రీలంక పోలీసులు తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేశారని, 2013 నుంచి జైలులో ఉంచినట్లు తెలిపారు.

భారత్‌ – శ్రీలంక ఒప్పంద ప్రకారం శ్రీలంక జైలులో ఉన్న పలువురు ఖైదీలు భారతదేశానికి మారారని, అలాగే తన భర్తను భారత జైలుకు మార్చేందుకు చర్యలు తీసుకోవాలంటూ భారత, శ్రీలంక దౌత్య కార్యాయాలకు పిటిషన్‌ అందజేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను భారత జైలుకు మార్చేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన న్యాయమూర్తులు కె.కల్యాణ సుందరం, పి.పుహళేంది కేంద్ర విదేశాంగ శాఖ, న్యాయశాఖ కార్యదర్శులు, విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి తరఫున బదులివ్వాలని ఉత్తర్వులిస్తూ విచారణను వాయిదా వేశారు. 

మరిన్ని వార్తలు