భర్త మరణించిన ఒక్కరోజు వ్యవధిలోనే భార్య కూడా

20 Aug, 2021 06:35 IST|Sakshi

సేలం: వృద్ధాప్యం వల్ల భర్త మృతి చెందడంతో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన గురువారం సేలంలో చోటు చేసుకుంది. సేలం పాత సూరమంగళం వెల్లై కవునర్‌ వీధికి చెందిన వృద్ధుడు పెరియన్నన్‌ (98). ఇతని భార్య అన్నమ్మ (90). వీరికి గణేశన్, సుందరం, రాము అనే ముగ్గురు కుమారులు, కుమార్తె కలైసెల్వి ఉన్నారు. వీరిలో గణేశన్, సుందరానికి మాత్రమే వివాహం అయ్యింది. రాము, కలై సెల్విలకు వివాహం చేసుకోలేదు.

అయితే, ముగ్గురు కుమారులు, కుమార్తె గత కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. గణేశన్, సుందరం వారివారి కుటుంబాలతో వేరు వేరుగా జీవిస్తూ వస్తున్నారు. దీంతో పెరియన్నన్, అన్నమ్మాల్‌ తోటలోని ఇంట్లో విడిగా నివసిస్తూ వచ్చారు. ఇక్కడ పొలం పండిస్తూ, పశువులను మేపుతూ పాలు విక్రయిస్తూ జీవిస్తున్నారు. ఈ స్థితిలో గత కొన్ని నెలలుగా పెరియన్నన్‌ అనారోగ్యానికి గురై మంచం పట్టాడు. ఆయనకు అన్నమ్మాల్‌ సేవలందించారు. ఈ స్థితిలో బుధవారం రాత్రి పెరియన్నన్‌ మృతి చెందాడు. రాత్రంతా భర్త పెరియన్నన్‌ మృతదేహం వద్ద ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్న అన్నమ్మాల్‌ తీవ్ర ఆవేదనతో గురువారం వేకువజామున ఇంట్లోని దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

గురువారం ఉదయం ఎంత సేపటికి అన్నమ్మాల్‌ బయటకు రాకపోవడంతో ఇరుగు పొరు గు వారు వెళ్లి చూడగా పెరియన్నన్‌ మంచంపై శవంగాను, దూలానికి అన్నమ్మాల్‌ మృతదేహంగాను వేలాడుతుండడం చూసి సూరమంగళం పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అన్నమ్మాల్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెరియన్నన్‌ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.   

మరిన్ని వార్తలు