కరెన్సీ నోట్లతో కరోనా వ్యాపిస్తుందా?

5 Aug, 2020 18:11 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉందా? అవుననే అనుమానంతోనే ప్రజలంతా నగదుకు బదులుగా డిజిటల్‌ లావాదేవీలను ఆశ్రయించాల్సిందిగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా మార్చి 16వ తేదీన దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. ఒక్క భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ మాత్రమే కాదు, ప్రపంచంలోని పలు సెంట్రల్‌ బ్యాంకులు కూడా తమ దేశాల ప్రజలకు ఈ పిలుపునిచ్చాయి. ఆఖరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా  డిజిటల్‌ లావాదేవీలను ఆశ్రయించడమే శ్రేయస్కరం అని సూచించింది. కావచ్చేమో అన్న అనుమానంతో దేశవ్యాప్తంగా అనేక మంది భారతీయులు నోట్లను ఇచ్చి పుచ్చుకునేటప్పుడు చేతులకు శానిటైజర్లు పూసుకుంటున్నారు. కొందరైతే నోట్లకు కూడా శానిటైజర్లను పూసి ఆరబెడుతున్నారు. కొందరైతే కరెన్సీ నాణాలను ముట్టుకోకుండా ఏదోచోట దాస్తున్నారు. (కరోనా : తక్కువ ధరలో మరో ఫావిపిరవిర్ డ్రగ్)

వారి భయాల్లో నిజమెంత? భారత దేశంలో 94 శాతం లావాదేవీలు నగదుతోనే నడుస్తున్నాయని ఇటీవలనే ఓ జాతీయ సర్వే తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ‘డిజిటల్‌ ఇండియా’ నినాదంతో సరికొత్త విప్తవానికి శ్రీకారం చుట్టడంతో ఓ దశలో దేశంలో డిజిటల్‌ లావాదేవీలు 27–29 శాతానికి చేరుకున్నాయి. కరోనా వైరస్‌ విజృంభణతో డిజిటల్‌ లావాదేవీలు పడిపోతూ మళ్లీ నగదు లావాదేవీలు ఊపందుకున్నాయి. ఇక్కడ కరెన్సీ లావాదేవీలకు, కరోనాకు సంబంధం ఏమిటీ అన్న అనుమానం రావచ్చు. 

కరెన్సీ కారణంగా కరోనా విస్తరించే అవకాశం ఉన్నట్లయితే కరెన్సీ లావాదేవీలు ఎక్కువగా సాగే భారత్‌లోనే ఇతర దేశాల కన్నా ఎక్కువ కరోనా కేసులు నమోదై ఉండాలి. శానిటైజర్లు ఉపయోగించడం వల్ల నోట్ల ద్వారా కరెన్సీ అంటుకోవడం లేదన్న లాజిక్‌ రావచ్చు. దేశంలో ఇప్పటికీ 35 శాతానికి మించి ప్రజలు శానిటైజర్లు ఉపయోగించడం లేదు. ఇక అందులో నోట్లకు కూడా  శానిటైజర్లను పూసే వారి సంఖ్య ఎంతుంటుందో ఊహించవచ్చు. నగదు లావాదేవీలు, జాతీయ స్థూల ఉత్పత్తి సంయుక్త నిష్పత్తితో పది లక్షల మందికి ఎంత మంది కరోనా రోగులు తేలుతున్నారనే సంఖ్యను పోల్చి చూడడం ద్వారా నోట్లకు, కరోనా కేసులకు సంబంధం ఉందా, లేదా అంశాన్ని అంచనా వేయవచ్చు.  (కరోనా వాక్సిన్: నోవావాక్స్ శుభవార్త)

ఉదాహరణకు స్వీడన్‌లో కరెన్సీ లావాదేవీలు–జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) నిష్పత్తి 3.1 శాతం ఉండగా, ఆ దేశంలో కరోనా రోగుల సంఖ్య జూలై నెల వరకు పది లక్షలకు 2,186 చొప్పున నమోదయ్యాయి. అదే భారత దేశంలో కరెన్సీ లావాదేవీలు–జీడీపీ రేషియో 11.2 శాతం ఉండగా, కరోనా కేసులు మాత్రం భారత్‌లో జూలై నెల నాటికి పది లక్షలకు 31 కేసుల చొప్పున నమోదయ్యాయి. కరెన్సీ తక్కువగా, డిజిటల్‌ లావాదేవీలు ఎక్కువగా జరిగే అమెరికా, యూరో జోన్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 

మరిన్ని వార్తలు