రామ్‌దేవ్‌ బాబాను అరెస్టు చేస్తారా?

23 Feb, 2021 11:52 IST|Sakshi

న్యూఢిల్లీ: యోగా గురు, పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు రామదేవ్‌ బాబాను అరెస్టు చేయాలంటూ పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. కరోనా విరుగుడుకు పతంజలి సంస్థ నుంచి ‘కొరొనిల్’‌ మందును తయారు చేసి ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదల సమయంలో కొరొనిల్‌కు‌ ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సర్టిఫికెట్‌ ఉందని చెప్పి రామ్‌దేవ్‌ బాబా అందరిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో ప్రజలను మోసం చేయాలని చూసిన యోగా గురును అరెస్టు చేయాలని పలు ఆరోగ్య సంస్థలు, సామాజిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ సూర్య ప్రతాప్‌ సింగ్‌ సైతం ఆయనను అరెస్టు చేయాలని న్యూఢిల్లీ పోలీసులను ఉద్దేశిస్తూ సోమవారం ట్వీట్‌ చేశారు.

‘డియర్‌ ఢిల్లీ పోలీసు..  ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరణ పేరుతో కోట్ల మంది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన రామ్‌దేవ్‌ బాబాను అరెస్టు చేస్తారా? ఇది అంతర్జాతీయ మోసంగా పరిగణించాలి. దీనికి కఠిన చర్యలు ఉండేలా చూడాలి’ అంటూ ట్విటర్‌ వేదికగా కోరారు. కాగా ఈనెల 19వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, మరో మంత్రి నితిన్‌ గడ్కరీ సమక్షంలో రామ్‌దేవ్‌ బాబా కొరొనిల్‌ మందును విడుదల చేశారు. ఫార్మాస్యూటికల్‌ ప్రొడక్ట్‌గా తమ మందుకు సర్టిఫికెట్‌ ఉందని, దీంతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన మరో సర్టిఫికెట్‌ ఉందని రామ్‌దేవ్‌ బాబా ప్రకటించారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాము ఏ సర్టిఫికెట్‌ జారీ చేయలేదని ట్విటర్‌లో స్పష్టం చేసింది. 

చదవండి: కొరొనిల్‌’ ప్రమోషన్‌పై దుమారం.. కేంద్రమంత్రిపై ఆగ్రహం
              పతంజలి ‘కరోనిల్‌’తో ఉపయోగం నిల్
 

మరిన్ని వార్తలు