పాకిస్తాన్‌ దాడి చేస్తే ఇలాగే వదిలేస్తారా ?

26 May, 2021 18:56 IST|Sakshi

వ్యాక్సిన్ల కొరతపై ఢిల్లీ సీఎం ఫైర్‌

కేంద్రాన్ని నిలదీసిన అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: ​‍పాకిస్థాన్‌ మన దేశంపై దాడికి దిగితే రాష్ట్రాలే నేరుగా పోరాటం చేయాలా? ఉత్తర్‌ప్రదేశ్‌ యుద్ధట్యాంకులు కొనుగోలు చేస్తే ఢిల్లీ తన సొంత ఆయుధాలతోనే రక్షణ కల్పించుకోవాలా​‍ ? కేంద్రం బాధ్యత ఏమీ లేదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌. వ్యాక్సిన్ల కొరతపై ఆయన కేంద్రంపై నిప్పులు చెరిగారు.

యుద్ధం చేస్తున్నాం
వ్యాక్సిన్ల కొరతపై అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ... ఈ రోజు దేశం మొత్తం కోవిడ్‌కి వ్యతిరేకంగా యుద్ధం చేస్తోంది. మన టీమిండియాగా ఈ పోరాటం చేయాలి. అంతేకాని రాష్ట్రాలు, కేంద్రాలు అంటూ వేర్వేరుగా కాదు. ఈ రోజు వ్యాక్సిన్లు అందివ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే రాష్ట్రాలది కాదు. కానీ ఈ విషయంలో జాప్యం జరుగుతున్న కొద్దీ .. ఎంత ప్రాణ నష్టం జరుగుతుందనేది  తెలియడం లేదు అంటూ  చెప్పారు అరవింద్‌ కేజ్రీవాల్‌. 

పాక్‌ దాడి చేస్తే 
మనం రాష్ట్రాలుగా జీవించడం లేదు. ఒక దేశంగా బతుకుతున్నాం. కేంద్రం ఎందుకు వ్యాక్సిన్లు రాష్ట్రాలకు సరఫరా చేయడం లేదంటూ కేంద్రాన్ని కేజ్రీవాల్‌ నిలదీశారు. ఒకవేళ పాకిస్తాన్‌ ఇండియాపై దాడి చేస్తే... రాష్ట్రాలను వాటి మానాన వాటిని వదిలేస్తారా ? యూపీ యుద్ధట్యాంకులు కొనుక్కోవాలా ? ఢిల్లీ ఆయుధాలు సమకూర్చుకోవాలా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

సెంట్లరు మూసేశాం
18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల లోపు వారికి టీకా ఇచ్చేందుకు ఢిల్లీలో కొత్తగా వ్యాక్సినేషన్‌ సెంటర్లు ఓపెన్‌​ చేద్దామని భావించామని, అయితే టీకాల కొరత కారణంగా ఉన్న సెంటర్లనే మూసేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు కేజ్రీవాల్‌. ఒక్క ఢిల్లీలోనే కాదు దేశమంతటా ఇంచుమించు ఇదే పరిస్థితి ఉందన్నారు. మరోవైపు వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలు నేరుగా రాష్ట్రాలకు అమ్మేందుకు సిద్ధంగా లేవని, కేంద్రం ద్వారానే అందిస్తామంటున్నాయని కేజ్రీవాల్‌ చెప్పారు
 

>
మరిన్ని వార్తలు