తల్లీకూతుళ్లను ఢీకొట్టిన అంబులెన్స్‌.. స్థానికుల ఆందోళనలతో..!

15 Oct, 2022 20:35 IST|Sakshi

కోల్‌కతా: రోడ్డుపై బస్సు కోసం 10 ఏళ్ల పాపతో ఓ మహిళ వేచి చూస్తోంది. సమయానికి బస్సు రాకపోగా.. అంబులెన్స్‌ రూపంలో అబులెన్స్‌ దూసుకొచ్చి తల్లీకూతుళ్లను అనంతలోకాలకు చేర్చింది. ప్రాణాలు కాపాడే అంబులెన్సే ఇరువురి పాలిట మృత్యుపాశమైంది. ఈ విషాద సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో శనివారం జరిగింది. నిర్లక్ష్యపూరితంగా వాహనం నడిపి ఇద్దరి ప్రాణాలు పోయేందుకు అంబులెన్స్‌ కారణమైన క్రమంలో స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో కోల్‌కతా-చెన్నైని కలిపే జాతీయ రహదారి 16పై సుమారు 5 గంటల పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 

శనివారం తెల్లవారుజామున 6.30 ప్రాంతంలో బాధితులు బస్సు కోసం వేచి చూస్తున్నారని, కోలఘాట్‌ వైపు వేగంగా వెళ్తున్న అంబులెన్స్‌ వారిని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో అంబులెన్స్‌లో ఎవరూ లేరని వెల్లడించారు. వేగంగా వచ్చి ఢీకొట్టటం వల్ల తల్లీకూతుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ క్రమంలోనే కొందరు స్థానికులు అక్కడికి చేరుకుని ధర్నాకు దిగారు. హైవేపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. అంబులైన్స్‌కు నిప్పుపెట్టారు. సుమారు 5 గంటల పాటు నిరసనలు చేపట్టటంతో కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఆందోళనకారులను మధ్యాహ్నానికి శాంతిపంజేసి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: వీరప్పన్‌ను మట్టుబెట్టిన పోలీసు అధికారి విజయ్‌ కుమార్‌ రాజీనామా

మరిన్ని వార్తలు