ప్లాస్టిక్‌ డ్రమ్ములో యువతి శవం 

5 Jan, 2023 21:23 IST|Sakshi

బెంగళూరు: యువతిని దారుణంగా హత్య చేసి ప్లాస్టిక్‌ డ్రమ్ములో కుక్కి పైన క్లాత్‌తో మూత బిగించి రైల్వే స్టేషన్‌లో దుండగులు వదిలివెళ్లిన దారుణమైన ఘటన ఐటీ సిటీ బెంగళూరులోని యశవంతపుర రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే... గూడ్స్‌ రైలు ప్లాట్‌ ఫాం వద్ద ఒక నీలి డ్రమ్ము, దాని మూత చుట్టూ బట్ట కట్టి ఉంది. మూడు రోజులుగా నిలిచి ఉన్న గూడ్స్‌ వెళ్లిపోవడంతో డ్రమ్ము బయటకు కనిపించింది. అందులో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్వీపర్‌ జయమ్మ రైల్వే పోలీసులకు తెలియజేసింది. వారు వచ్చి పరిశీలించగా యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో బయటపడింది. మృతదేహం గొంతుకు తెల్లటి దుపట్టా చుట్టి ఉంది. ముఖమంతా గుర్తుపట్టలేకుండా ఉంది.

మూడు నాలుగు రోజుల కిందటే ఆమెను చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆమె వయసు 23 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. యువతి రూపురేఖలను బట్టి విద్యావంతురాలై ఉంటుందని, ఎక్కడో చంపి, డ్రమ్ములో పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో అమర్చిన సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో పడ్డారు. న్యూ ఇయర్‌ సంబరాల్లో ఎవరైనా దుండగులు ఆమెను అపహరించి హత్య చేసి ఉంటారనే సందేహాలూ వినిపిస్తున్నాయి.  

చదవండి: (అయోధ్య రామ మందిరం నిర్మాణంపై అమిత్‌ షా కీలక ప్రకటన)

మరిన్ని వార్తలు