విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

8 Oct, 2020 14:13 IST|Sakshi

న్యూఢిల్లీ : విమానంలో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీ.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఓ గర్భిణీ మార్గమధ్యంలో ప్రసవించింది. తల్లి బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లు ఇండిగో విమాన సంస్థ పేర్కొంది. బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన 6 ఈ 122(6E 122 ) అనే విమానంలో ఓ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని, తమ సిబ్బంది ఆమెకు తోడుగా నిలిచారని ఇండిగో సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

అయితే రాత్రి 7.30 గంటలకు బెంగళూరులో విమానం ల్యాండ్ అయిన వెంటనే తల్లీ బిడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించినట్లు ఇండిగో పేర్కొంది. ఈ సందర్భంగా బెంగళూరు ఎయిర్‌పోర్టులో తల్లీబిడ్డలకు గొప్ప స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇండిగో సిబ్బంది తల్లీబిడ్డలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా  ప్లాట్‌ఫాంలల్లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అలానే పుట్టిన బిడ్డకు ఇండిగో సంస్థ భారీ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. విమానంలో పుట్టాడు కాబట్టి అతనికి జీవితాంతం ఫ్లైట్‌ టికెట్‌ ఉచితంగా అందినట్లు సమాచారం. అయితే దీనిపై ఇండిగో సంస్థ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. 

 

మరిన్ని వార్తలు