ట్రాఫిక్‌ జరిమానా కోసం తాళి తాకట్టు ! 

28 Feb, 2021 07:05 IST|Sakshi

పోలీసుల తీరుపై అతివ ఆగ్రహం 

సాక్షి బెంగళూరు: ట్రాఫిక్‌ పోలీసుల వేధింపులు తాళలేక తన మాంగల్యాన్నే పణంగా పెట్టేందుకు ఓ మహిళ సిద్ధమైంది. ఈ ఘటన బెళగావిలో జరిగింది. హుక్కేరి తాలూకా హుల్లోళిహట్టి గ్రామానికి చెందిన భారతి అనే మహిళ పోలీసుల అమానవీయతను గురించి మాట్లాడుతూ ఒక వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందంటే..భారతి తన భర్తతో కలసి బైక్‌పై బెళగావి మార్కెట్‌కు వచ్చింది. తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో బస్టాండ్‌ వద్ద హెల్మెట్‌ లేదని పోలీసులు బైక్‌ను నిలిపేశారు.

డాక్యుమెంట్లు పరిశీలించకుండానే నేరుగా జరిమానా విధిస్తూ రసీదు చేతికందించారు. అసలే మార్కెట్‌కు వెళ్లి డబ్బులు ఖాళీ చేసుకుని వెళుతున్న ఈ దంపతుల వద్ద కేవలం రూ.100 మాత్రమే ఉంది. జరిమానా కింద ఈ రూ.100 తీసుకుని వదిలేయండి అంటూ దంపతులు ప్రాధేయపడ్డారు. అయితే ఏమాత్రం కనికరించని పోలీసులు ఫైన్‌ కట్టి వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. పోలీసుల తీరుకు విసిగిపోయిన మహిళ తన మెడలో ఉన్న బంగారు తాళిని తీసి భర్త చేతికిచ్చి ఇది తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురండి అని చెప్పింది. చివరికి అక్కడికి చేరుకున్న సీనియర్‌ పోలీసు ఉన్నతాధికారులు విషయం తెలుసుకుని దంపతులను వదిలేశారు

చదవండి:
భార్యను భయపెట్టాలని.. ఆసుపత్రి పాలై..
కిలేడీ.. మేకప్‌ వేసుకుంటే కనుక్కోలేం!..

 

>
మరిన్ని వార్తలు