వీళ్లు ఆడవాళ్లా లేక రౌడీలా?.. తప్పతాగి నడిరోడ్డులో యువతిపై దాడి

7 Nov, 2022 17:32 IST|Sakshi

భోపాల్‌: తాగిన మత్తులో అర్ధరాత్రి నలుగురు మహిళలు నడిరోడ్డులో హల్‌చల్‌ చేశారు. మరో మహిళపై దాడి చేశారు. కాలితో తన్నుతూ, బెల్టుతో కొడుతూ చిత్రహింసలు పెట్టారు. చుట్టూ చాలా మంది ఉన్నా వారి దుశ్చర్యను ఎవరూ అడ్డుకోకపోగా.. వీడియోలు తీస్తూ ఉండిపోయారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. యువతిపై నలుగురు మహిళలు దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

ఇండోర్‌లోని ఎల్‌ఐడీ జంక్షన్‌ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. యువతి వెంట్రుకలు పట్టుకుని పిడిగుద్దులతో విరుచుకుపడటం, బెల్టుతో కొట్టటం, కిందపడేసి తన్నుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనపిస్తున్నాయి. ఎలాంటి కారణం లేకుండానే తనపై నలుగురు మహిళలు దాడి చేశారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు ఇండోర్‌లోని ఓ ఎరువుల దుకాణంలో సెల్స్‌పర్సన్‌గా పని చేస్తోందని, ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: మద్యం మత్తులో ఎమ్మెల్యే కొడుకు హంగామా.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు