మెట్రో స్టేషన్‌లో యువతిపై లైంగిక వేధింపులు.. మరీ ఇంత దారుణమా..?

4 Jun, 2022 08:11 IST|Sakshi

దేశంలో యువతులు, మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించే సమయంలో కొందరు ఆకతాయిలు మహిళలను లైంగికంగా వేధిస్తూనే ఉన్నారు. తాజాగా మెట్రో స్టేషన్‌లో ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఓ యువకుడు.. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చేటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. బాధిత యువతి ఢిల్లీలోని జోర్‌బాగ్‌ మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కింది. అనంతరం రైలులో ఉన్న ​ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఓ అడ్రస్‌ గురించి అడిగాడు. ఈ క్రమంలో ఆమె అతడికి అడ్రస్‌ చెప్పింది. అనంతరం ఆమె దిగిపోవాల్సిన స్టేషన్‌ రాగా.. రైలు దిగి మరో రైలు కోసం ఎదురు చూస్తూ ప్లాట్‌ఫామ్ మీద ఉన్న బెంచి మీద కూర్చుంది. ఇంతలో అడ్రస్‌ అడిగిన వ్యక్తి మళ్లీ ఆమె వద్దకు వచ్చి.. మరోసారి అడ్రస్‌ను కోరి.. క్లియర్‌ చెప్పమని అడిగాడు. 

ఈ క్రమంలో సదరు వ్యక్తి.. బాధితురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తన శారీరక అవయవాలను ఆమెకు తాకిస్తూ దారుణంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు.. అతను ఏం చేస్తున్నాడో గమనించి.. ప్లాట్‌ఫామ్‌ మీది ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పింది అతను పట్టించుకోకుండా పై ఫ్లోర్‌లో ఉన్న స్టేషన్‌లో ఫిర్యాదు చేయమన్నాడు. దీంతో షాకైన యువతి.. మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని కూడా గుర్తించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకునేందుకు నిరాకరించారు. దానిని పెద్ద సీన్ చేయవద్దని ఆమెకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. 

దీంతో, బాధితురాలు తనకు జరిగిన చేదు అనుభవాన్ని ట్విట్టర్‌ ద్వారా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ట్వీట్‌కు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ అధికారులు స్పందించారు. ఆ ఘటనపై తగు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఇక, ఈ ఘటనపై సీరియస్‌ అయిన ఢిల్లీ మహిళా కమిషన్‌.. కేసు సుమోటోగా స్వీకరిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. 

ఇది కూడా చదవండి: ‘ఆర్య సమాజ్‌’  మ్యారేజ్‌ సర్టిఫికెట్లు చెల్లవు 

మరిన్ని వార్తలు