అప్పటిదాకా పోటీచేయను

23 Mar, 2023 06:26 IST|Sakshi

శ్రీనగర్‌: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌ తొలగించిన ఆర్టికల్‌ 370ను పునరుద్ధరించేదాకా తాను శాసనసభ సమరంలో అడుగుపెట్టబోనని పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ) చీఫ్‌ మెహబూబా ముఫ్తీ స్పష్టంచేశారు. జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం అయిన మెహబూబా బుధవారం పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ రద్దయిన ఆర్టికల్‌ను పునరుద్ధరించే వరకు జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగను. ఇది సరైన నిర్ణయం కాదని నాకూ తెలుసు.

కానీ ఇది భావోద్వేగంతో తీసుకున్న కఠిన నిర్ణయం. ఎన్నికైన ప్రభుత్వం ఉంటే తమ రహస్య ఎజెండా కార్యరూపం దాల్చదనే భయంతోనే బీజేపీ ప్రభుత్వం ఆ ఆర్టికల్‌ను తొలగించింది. ‘ఆర్టికల్‌ను రద్దుచేసి కశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని కేంద్రం చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే పంచాయితీ ఎన్నికలే ప్రజాస్వామ్యానికి అసలైన గీటురాయి అన్నపుడు ప్రధాని, హోం మంత్రి వంటి వేరే పదవులు ఎందుకు ? వాళ్లు ఏం చేస్తున్నట్లు ?. కశ్మీర్‌ ప్రజలను బలహీనపరచి తమ ముందు సాగిలపడేలా చేయాలని కేంద్రం కుట్ర పన్నింది’ అని ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు