రచయిత గంగరాజు మోహనరావు మృతి

6 Jun, 2021 11:09 IST|Sakshi

సాక్షి, చెన్నై: ప్రముఖ రచయిత డాక్టర్‌ గంగరాజు మోహనరావు(85) శనివారం మృతిచెందారు. ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా, నగరి మండలం, క్షూరికాపురం. పులిచర్ల మండలం, పాకాల ప్రాథమిక పాఠశాల్లో ప్రధానోపాధ్యాయుడిగా పని చేశారు. ప్రస్తుతం చెన్నై తిరునిండ్రవూరు సమీపంలోని ఆవడి పరుత్తిపట్టులో నివసిస్తున్నారు. అలివేలుమంగ శతకం, శ్రీనివాస శతకం, షిర్డీ సాయి శతకం, చందమామ (బాలగేయాలు), గంగరాజు నానీలు, హైకూలు వంటి పలు పుస్తకాలు రాశారు. 1936 నబంబర్‌ 5న జన్మించిన గంగరాజు మోహనరావు తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు.

వీరి రచనలను ఆంధ్రప్రభ, విజ్ఞానసుధ, ప్రియదత్త, రమ్యభారతి, సాహితీ కిరణం, బాలమిత్ర, బుజ్జాయి వంటి పలు పత్రికలు ప్రచురించాయి. ఆయన సాహితీ సేవలను గుర్తించిన చెన్నైలోని వేదవిజ్ఞాన వేదిక ఆయన్ను సత్కరించింది. అలాగే మద్రాసు తెలుగు అభ్యుదయ సమాజం, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ, అనేక తెలుగు సంఘాలు సత్కరించాయి. తెలుగుభాషకు, సాహిత్యానికి చేసిన కృషికి 2020 ఫిబ్రవరిలో మైసూరు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ గౌరవ డాక్టరేట్‌తో చెన్నైలో సత్కరించింది. ఈయన రాసిన కామాక్షి శతకం చివరిది. చెన్నైలోని పలు తెలుగు సంఘాల ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

చదవండి: Ardha Shathabdam: ఆకట్టుకుంటున్న ‘మెరిసేలే మెరిసేలే’ సాంగ్‌

మరిన్ని వార్తలు