యోగి స్వింగర్లను విపక్షాలు ఆడలేకపోతున్నాయి

20 Dec, 2021 06:06 IST|Sakshi

ఝాన్సీలో జనవిశ్వాస్‌ యాత్రలో రాజ్‌నాథ్‌

ఝాన్సీ (యూపీ): ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వేసే ఇన్‌స్వింగర్లు, ఔట్‌ స్వింగర్లను విపక్షాలు ఆడలేకపోతున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. క్రికెట్‌ పరిభాషను వాడుతూ... యోగిని ఆల్‌రౌండర్‌గా అభివర్ణించారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌.. ఎవరూ ఆయన ధాటికి నిలువలేకపోతున్నారని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఆదివారం ఏడుచోట్ల నుంచి జనవిశ్వాస్‌ యాత్రల పేరిట మెగా ర్యాలీలను ప్రారంభించింది.

ఇందులో భాగంగా రాజ్‌నాథ్‌ ఝాన్సీలో ఆదివారం ఒక ర్యా లీని ప్రారంభించి మాట్లాడారు.  గతంలో క్రిమినల్స్‌ రాత్రి కాగానే నాటు తుపాకులు పట్టుకొని వీధుల్లో తిరిగేవారని, ఇప్పుడలా చేసే సాహసం ఎవరూ చేయలేరన్నారు. యోగి అద్భుతాలు చేశారని కొనియాడారు. సమాజ్‌వాది పార్టీ పాలనలో అవినీతి, అన్యాయం, పేదలపై దౌర్జన్యాలు జరిగాయని లక్నోలో జనవిశ్వాస్‌ యాత్రను ఆరంభించిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. వారసత్వ రాజకీయాల్లేని పార్టీ బీజేపీయే అన్నారు. 

మరిన్ని వార్తలు