దేశ ఔన్నత్యానికి ప్రతీకగా..

22 Sep, 2020 18:31 IST|Sakshi

ఫిల్మ్‌సిటీ నిర్మిస్తాం : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌

లక్నో : యమున ఎక్స్‌ప్రెస్‌వేపై హస్తినాపూర్‌ వద్ద దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్‌ సిటీని నిర్మిస్తామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ మంగళవారం ప్రకటించారు. సినీ పరిశ్రమ ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైన యోగి నూతన ఫిల్మ్‌ సిటీ ప్రతిపాదనపై చర్చించారు. దీనిపై యమున ఎక్స్‌ప్రెస్‌వే పారిశ్రామిక అభివృద్ధి అథారిటీ ప్రజెంటేషన్‌ ఇచ్చిందని, ప్రతిపాదిత ఫిల్మ్‌ సిటీని దేశ ఔన్నత్యానికి ప్రతీకగా నిర్మిస్తామని స్పష్టం చేశారు. గంగ, యమునా నదుల మధ్య ఈ ప్రాంతం ఉందని, యమునా నదికి సమాంతరంగా నిర్మించిన యమునా ఎక్స్‌ప్రెస్‌ను ఢిల్లీ, ఆగ్రాలను కలిపేందుకు నిర్మించారని చెప్పారు.

ఈ ప్రాంతమంతా రెండు పవిత్ర నదుల మధ్యన ఉంటుందని చెప్పుకొచ్చారు. హస్తినాపూర్‌ చుట్టూ ప్రతిపాదిత ఫిల్మ్‌సిటీని నిర్మించనున్నామని వెల్లడించారు. ఇక ఈనెల 20న యోగి ఆదిత్యానాథ్‌ ప్రముఖ దర్శకులు మధుర్‌ భండార్కర్‌తో సమావేశమైన సందర్భంగా ప్రతిపాదిత ఫిల్మ్‌ సిటీపై ఆయనతో చర్చించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు