చీమల్ని చంపబోయి అగ్నికి ఆహుతైన యువతి!

23 Nov, 2020 06:44 IST|Sakshi

సాక్షి, చెన్నై: చీమల్ని చంపేందుకు అగ్గితో చేసిన ప్రయత్నం ఓ యువతిని ఆహుతి చేసింది. ఆదివారం అమింజికరైలో ఈ ఘటన వెలుగు చూసింది. చెన్నై అమింజికరై పెరుమాల్‌ ఆలయం వీధికి చెందిన సత్యమూర్తికి భార్య, ఓ కుమారుడు, కుమార్తె సంగీత(27) ఉన్నారు. షోళింగనల్లూరులోని ఓ సంస్థలో సంగీత ఐటీ ఇంజినీర్‌. వీరి నివాసం కూవం నదీ తీరంలో ఉంది. శనివారం చీమల్ని చంపేందుకు సంగీత చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. చీమలు ఉన్న చోట్ల కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టింది.   (42 ఏళ్ల క్రితం చెన్నైలో చోరీ.. లండన్‌లో దొరికాయి!)

అదే సమయంలో తన చేతిలో ఉన్న బాటిల్‌ నుంచి కిరోసిన్‌ను మంటలపై పోసి ప్రమాదాన్ని ఆమె కొని తెచ్చుకుంది. చేతిలో ఉన్న కిరోసిన్‌ బాటిల్‌సహా మంటలు చుట్టుముట్టడంతో అగ్నికి ఆహుతి అవుతున్న సంగీతను రక్షించే ప్రయత్నంలో తల్లిదండ్రులు, సోదరుడు గాయపడ్డారు. ఇరుగు పొరుగు అతికష్టంపై కొన ఊపిరితో ఉన్న సంగీతను చికిత్స నిమిత్తం కీల్పాకం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం సంగీత విగతజీవి గా మారింది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.  (పేద విద్యార్థి కల నెరవేర్చిన శివకార్తికేయన్‌)

మరిన్ని వార్తలు