చాటింగ్, హాట్‌ ఫొటోలతో పారిశ్రామికవేత్తకు టోకరా

14 Aug, 2022 07:40 IST|Sakshi

బెంగళూరు: యువతి పేరుతో పంపిన హాట్‌ ఫోటోలకు స్పందించిన వృద్ధ పారిశ్రామికవేత్తను కేటుగాళ్లు పోలీసుల పేరుతో బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.14.90 లక్షలు కొల్లగొట్టారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న హలసూరుగేట్‌ పోలీసులు కవనా, నిధి అనే వారిపై కేసు నమోదు చేశారు.  

పోలీసులపేరుతో రైడ్‌  
హోసూరురోడ్డులో సదరు పారిశ్రామికవేత్తకు స్వంత కంపెనీ ఉంది. నాలుగేళ్ల క్రితం ఇన్సూరెన్స్‌ విషయంపై కవనా అనే యువతి పరిచయమైంది. వారం క్రితం నిధి అనే యువతిని పారిశ్రామికవేత్తకు పరిచయం చేసింది. ఆమె పారిశ్రామికవేత్తతో వాట్సాప్‌లో చాటింగ్‌ చేస్తుండేది. ఈ విషయాన్ని తెలుసుకున్న నిధి స్నేహితుడు యువరాజు నిధి పేరుతో మరో ఫోన్‌ నంబర్‌ ద్వారా ఆ పారిశ్రామికవత్తకు హాట్‌ పొటోలు పంపాడు.

ఈనెల 3 తేదీన నిధి సెల్‌ నుంచి పారిశ్రామికవేత్తకు మెసేజ్‌ పంపించి హొసూరురోడ్డు పెట్రోల్‌బంక్‌ వద్దకు పిలిపించాడు. మరో వ్యక్తితో కలిసి   తాము క్రైం పోలీసులమంటూ ఆ పారిశ్రామికవేత్త కారు కీ, మొబైల్‌ను లాక్కున్నారు. యువతితో చాటింగ్‌ చేసిన వీడియో స్క్రీన్‌షాట్, హాట్‌ ఫొటోలకు సంబంధించి మీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని, ఈ కేసు మూసివేయాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మొత్తం 14.90 లక్షలు తీసుకున్నారు.

చదవండి: (కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు మృతి)

ఈనెల 10 తేదీన ఫోన్‌ చేసి కేజీ.రోడ్డు బసప్పపార్కు  వద్దకు పిలిపించి  రూ.50 వేలు తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తులు నకిలీ పోలీసులని పసిగట్టిన సదరు పారిశ్రామికవేత్త హలసూరుగేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలింపు చేపట్టి యువరాజ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ఈ వ్యవహారంలో అతనే సూత్రధారి అని తేలిందని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. జిమ్‌ ట్రైనర్‌ అయిన యువరాజు  అప్పుల ఊబిలో కూరుకుపోయాడని, స్నేహితురాలు నిధి పారిశ్రామికవేత్తకు మెసేజ్‌ చేయడాన్ని గమనించి మరో నెంబరు నుంచి అదే పేరుతో చాటింగ్‌ చేయించి నకిలీ పోలీసుల అవతారమెత్తి నగదు దోచుకున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు