లవర్‌కి గిఫ్ట్‌గా ఫోన్‌ ఇచ్చాడని మరీ ఇంత దారుణమా..

31 May, 2021 20:36 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో దారుణం

ఇద్దరు యువకుల పట్ల అమానవీయ ప్రవర్తన

జబల్‌పూర్‌ (మధ్యప్రదేశ్‌): మధ్యప్రదేశ్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గర్ల్‌ ఫ్రెండ్‌కి మొబైల్‌ ఫోన్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడని దారుణానికి తెగబడ్డారు అమ్మాయి కుటుంబ సభ్యులు. ఫోన్‌ కొనిచ్చిన యువకుడు, అతని స్నేహితుడి పట్ల అమానవీయంగా అవమానించారు. 

అమానవీయం
అగ్రవర్ణానికి చెందిన అమ్మాయికి ఫోన్‌ ఇచ్చినందుకు గాను ఇద్దరు దళిత యువకులకు గుండు కొట్టించారు. ఆ తర్వాత వారి మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. అంతటితో ఆగకుండా ఇద్దరిని నేలపై ఉమ్మించి ఒకరి ఉమ్మును మరొకరి చేత నాకించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్‌లో  మే 22 న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

ఫోన్‌ ఇచ్చాడని
జబల్‌పూర్‌ జిల్లాలో దామన్‌ ఖమారియా గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ మెహ్రా అనే దళిత యువకుడు అదే ఊరిలో అగ్రవర్ణానికి చెందిన 19 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుత లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి నుంచి బయటకు రావడానికి కుదరడం లేదని,  తనకో ఫోన్‌ కొనివ్వాలంటూ ఆ అమ్మాయి కోరింది. దీంతో రాజ్‌కుమార్‌ తన స్నేహితుడైన మహేంద్రకు చెందిన ఫోన్‌ను ఆ అమ్మాయికి ఇచ్చాడు. 


విచక్షణ కోల్పోయారు
ఆ అమ్మాయి ఫోన్‌లో మాట్లాడుతుండగా కుటుంబ సభ్యులు చూశారు. ఆమెను విచారిస్తే ఫోన్‌ గిఫ్ట్‌గా ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఆగ్రహించిన అమ్మాయి కుటుంబ సభ్యులు ఇద్దరు దళిత యువకులను నిర్బంధించి దారుణానికి తెగబడ్డారు.
 

మరిన్ని వార్తలు