‘ద్ర‌వ్యోల్బ‌ణాన్ని  అరిక‌ట్ట‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం విఫలం’

2 Aug, 2022 16:05 IST|Sakshi

ఢిల్లీ: ద్ర‌వ్యోల్బ‌ణాన్ని  అరిక‌ట్ట‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయి పేద, మధ్య తరగతి ప్రజలపై భారం తీవ్రంగా పడుతుందన్నారు. ధరల పెరుగుదలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వైఎస్సార్‌సీపీ తరఫున విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘ప్ర‌జ‌ల సామాజిక‌, ఆర్థిక ర‌క్ష‌ణ‌ బాధ్య‌త కేంద్రానిదే.క‌రోనా వ‌ల్ల వెన‌క్కి వెళ్లిన ప్ర‌జ‌లు తిరిగి ప‌నుల‌కు రాక‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి త‌గ్గిపోయింది.బొగ్గు, నూనె ధ‌ర‌లు ఏడేళ్ల అత్యంత గ‌రిష్ట స్థాయికి చేరాయి.సెస్‌, స‌ర్ చార్జి లలో రాష్ట్రాల‌కు ఎందుకు వాటా ఇవ్వ‌రు. కేంద్రం త‌న మొత్తం ప‌న్నుల వాటాలో 41 శాతం వాటా ఇవ్వ‌డం లేదు.

కేవ‌లం 31 శాతం ప‌న్నుల వాటా మాత్ర‌మే రాష్ట్రాల‌కు అందుతోంది. దీని వ‌ల్ల ఏడేళ్లలో 46 వేల కోట్ల రూపాయ‌లు ఏపీ నష్టపోయింది. రాష్ట్రాల నుంచి సెస్, స‌ర్ చార్జీల రూపంలో కేంద్ర ప్ర‌భుత్వం దోపిడీ చేస్తోంది. పీపీఎఫ్‌, సుక‌న్య స‌మృద్ధి యోజ‌న వ‌డ్డీ రేట్ల‌ను పెంచాలి. విదేశాల‌లో ద్ర‌వ్యోల్బ‌ణం ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం త‌న‌ను తాను స‌మ‌ర్థించుకోవ‌డం స‌రైంది కాదు’ అని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.

మరిన్ని వార్తలు