ధరలపై కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి: వైఎస్సార్‌సీపీ ఎంపీలు

3 Aug, 2022 14:34 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, కేంద్రం దదిద్దుబాటు చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

‘‘ఈ రెండేళ్లలో ధరలు రెండు రెట్లు పెరిగాయి. దిగుమతులు పెరిగిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. జీడీపీ తొమ్మిది నుంచి ఏడు శాతానికి పడిపోయింది. చమురు దిగుమతి వల్ల ఎకానమీపై భారం పెరిగింది. అందుకే.. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అందుబాటులో తేవాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో సోలార్ ఎనర్జీ విషయంలో కేంద్ర తీరు సరికాదు. 

నదుల అనుసంధానంతో కరెంట్ ఉత్పత్తి పెంచే అవకాశం ఉంది. వంట గ్యాస్ ధరలు తగ్గించాలి.పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల పామాయిల్ రెట్లు పెరిగాయి. కానీ వాటి ధరలు తగ్గించే చర్యలు తీసుకోవాలి. తిరుమల తిరుపతిపై జీఎస్టీ రద్దు చేయాలి. హిందువుల మనోభావాలు కాపాడాలని ఎంపీ మార్గాని భరత్‌ కేంద్రాన్ని కోరారు. 

కేంద్రం ఆదుకోవడం లేదు
ధరల పెరుగుదలపై కేంద్రం కారణాలు మాత్రమే చెప్తోందని.. ఎవరిని ఆదుకోవడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత తెలిపారు. ప్రజలు కూడా అదే సమస్యలతో బాధపడుతున్నారు. ధరల పెరుగుదలతో తీవ్ర కష్టాలపాలు అవుతున్నారు. మానవతా దృక్పథంతో ప్రజలను ప్రధాని ఆదుకోవాలి. ప్యాకేజీ ఫుడ్ పై జీఎస్టీ వేయడం దారుణం. కష్టాలు ఉన్నా.. ఏపీలో సీఎం వైఎస్ జగన్ అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మేం గడప గడప కార్యక్రమం కింద ప్రజల వద్దకు వెళితే.. ధరల తగ్గించేలా పార్లమెంట్‌లో మాట్లాడాలని అడుగుతున్నారు అని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు