సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభకు ఇటీవల ఎంపికైన వైఎస్సార్సీపీ సభ్యులు ఎస్.నిరంజన్రెడ్డి, ఆర్.కృష్ణయ్య శుక్రవారం ఉదయం 10 గంటలకు దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు వీరిద్దరితో ప్రమాణం చేయించారు. ఆర్.కృష్ణయ్య తెలుగులో, నిరంజన్రెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు.
అనంతరం చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు వీరిద్దరికీ అభినందనలు తెలిపారు. మరోవైపు, తెలంగాణ నుంచి ఎన్నికైన టీఆర్ఎస్ సభ్యులు దామోదర్రావు, పార్థసారధిరెడ్డిలతో కూడా చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ తదితరులు హాజరయ్యారు.