అమెరికా ఎన్నారైల్లో తెలుగు వారే టాప్‌.. పోటీగా గుజరాత్‌

29 Nov, 2021 13:56 IST|Sakshi

Social Realities of Indian Americans, Results From the 2020 Indian American Attitudes Survey | Telugu News: అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల్లో తెలుగు వారు అగ్రస్థానంలో నిలుస్తున్నారు. వలసలు ఎక్కువగా ఉండే కేరళా, గుజరాత్‌ వంటి రాష్ట్రాలకు దీటుగా విదేశాల్లో తెలుగు ‍ఖ్యాతిని రెపరెపలాడిస్తున్నారు. కార్నెగే ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ సంస్థ ఇటీవల అమెరికాలో సోషల్‌ రియాలిటీస్‌ ఆఫ్‌ ఇండియన్‌ అమెరికన్స్‌. రిజల్ట్‌ ఫ్రమ్‌ ది 2020 ఇండియన్‌ అమెరికన్‌ అట్యిట్యూడ్‌ పేరుతో సర్వే నిర్వహించింది. ఇందులో అమెరికాలో ఉన్న ఎన్నారైలకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

ఫస్ట్‌ గుజరాత్‌
ఇండియన్‌ అమెరికన్‌ అట్యిట్యూడ్‌ సర్వే ప్రకారం అమెరికాలో 4.3 మిలియన్ల భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో గుజరాత్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువ మంది మంది ఉన్నారు. అమెరికా ఎన్నారైలలో 14 శాతం మంది తాము గుజరాత్‌ నుంచి వచ్చినట్టు పేర్కొనగా ఆ తర్వాత 12 శాతంతో మహారాష్ట్ర వారు నిలిచారు. 10 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది.

తెలుగువారి హవా
ప్రవాస భారతీయుల్లో 14 శాతంతో గుజరాత్‌ అగ్రస్థానంలో నిలిచినప్పటికీ అదే స్థాయిలో అక్కడ తెలుగు వారు కూడా ఉన్నారు. యూఎస్‌ ఎన్నారైల్లో 10 శాతం ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారు ఉండగా తెలంగాణ వారు 4 శాతంగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మొత్తం ఎన్నారైలను పరిగణలోకి తీసుకుంటే గుజరాత్‌తో పాటు అగ్రస్థానంలో తెలుగు వారు నిలుస్తున్నారు.

ఢిల్లీ నుంచి ఎక్కువ
నగర రాష్ట్రంగా ఉన్నప్పటికీ ఢిల్లీ నుంచి భారీ స్థాయిలో అమెరికాకు వలసలు కొనసాగుతున్నట్టుగా తాజా సర్వే స్పష్టం చేస్తోంది. తమిళనాడుతో, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన ఎన్నారైల వాటా 9 శాతంగా తేలింది. పంజాబ్‌ 8 శాతం, కేరళ 7 శాతం, కర్నాటక 5 శాతం, ఉత్తర్‌ ప్రదేశ్‌, బెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన వారు 4 శాతంగా ఉన్నారు. ఈ సర్వే ప్రకారం నాగాలాండ్‌, మిజోరాం రాష్ట్రాల నుంచి అమెరికాలో ఎన్నారైల ప్రాతినిధ్యం దాదాపు శూన్యమనే చెప్పుకోవాలి. 

చదవండి: ఎన్నారైలకు సీబీఎస్‌ఈ శుభవార్త! స్కూల్‌ అడ్మిషన్లపై కీలక ప్రకటన

మరిన్ని వార్తలు