కెనడాలో కాల్పుల కలకలం.. భారతీయ విద్యార్థి మృతి

19 Sep, 2022 12:54 IST|Sakshi

టోరంటో: కెనడాలోని అంటారియా ప్రావిన్స్‌లో కాల్పుల కలకలం జరిగింది. ఈ ఘటనలో 28 ఏళ్ల భారతీయ విద్యార్థి, పోలీస్‌ కానిస్టేబుల్‌ తోపాటు మరోక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మృతి చెందిన భారతీయ విద్యార్థిని సత్వీందర్‌ సింగ్‌గా గుర్తించారు. అతను ఈ కాల్పుల సమయంలో ఆటో రిపేర్స్‌లో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు.

అతను కెనడాలోని కోనెస్టాగా కాలేజీ విద్యార్థి అని చెబుతున్నారు. ఈ కాల్పుల్లో టొరంటో పోలీస్ కానిస్టేబుల్ ఆండ్రూ హాంగ్, ఆటో రిపేర్స్ యజమాని, మెకానిక్ షకీల్ అష్రఫ్ అక్కడికక్కడే మరణించారని చెప్పారు.  ఐతే సత్వీందర్‌ సింగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు.

అంతేకాదు ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని 40 ఏళ్ల సీన్ పెట్రీగా గుర్తించి, అతనిపై కాల్పులు జరిపి హతమార్చినట్లు వెల్లడించారు. నిందితుడు ఒక అధికారి కోసం వచ్చి ఈ దారుణానికి  ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

(చదవండి: పుట్టిన రోజు నాడే విషాదం.. స్కూల్‌ బస్సులో చిన్నారి నిద్ర.. సిబ్బంది నిర్లక్ష్యంతో..)
 

మరిన్ని వార్తలు