ఘంటసాలకు భారతరత్న పురస్కారంతో గౌరవించాలి : గీత రచయిత చంద్రబోస్‌

23 Jun, 2022 10:15 IST|Sakshi

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితమంటూ శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 120 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకొస్తోంది. ఇందులో భాగంగా హాంకాంగ్  నుంచి జయ పీసపాటి (వ్యవస్థాపక అధ్యక్షురాలు, హాంకాంగ్ తెలుగు సమాఖ్య)  జూన్  19న  జరిగిన అంతర్జాల కార్యక్రమములో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.  

ఘంటసాలకు ‘భారతరత్న’ కోసం చేస్తున్న కృషి అభినందనీయం- చంద్రబోస్‌
నంది పురస్కార గ్రహిత, గీత రచయిత చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఘంటసాలకు భారతరత్న పురస్కార కోసం 30 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు అందరు కృషి చేయడం అభినందనీయమన్నారు. గాయకుడిగా  ఘంటసాల ఎన్నో అత్యద్భుత గీతాలను ఆలపించి ఇప్పటికి ఎన్నటికీ తెలుగువాడి పాటను ప్రపంచ ఖ్యాతిని నలుచెరుగులా రెపరెపలాడించారన్నారు.  సంగీత దర్శకుడిగా వందకుపైగా ఆణిముత్యాలు లాంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించడం భారతదేశ సినీ పరిశ్రమ మొత్తంలో వారికే చెల్లిందని కొనియాడారు.  ఘంటశాల అమృతం  గళంనుంచి జాలువారిన దేశభక్తి ప్రభోదించే గీతాలతోపాటు, కుంతీ విలాపం, పుష్ప విలాపము, బంగారుమామ జానపద గేయాలు,  జాషువా గారి బాబాయ్ పాటలు మనుషుల జీవన ప్రమాణాలను ప్రభోదించే భగవత్గీత లాంటివాటిని గుర్తు చేశారు.  బాల్యంలో కడు పేదరికాన్ని అనుభవంచి వారాలు గడిపి సంగీతం నేర్చుకొని  సినీ పరిశ్రమలో ఎవరు అందుకొని మైలురాళ్ళను  చేరుకోగలిగారనీ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన వ్యక్తి అని, ఇప్పటికైనా వారి సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలని, ఈ సందర్భంగా నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు.

భారతదేశ గర్వించదగ్గ మహోన్నత గాయకుడు ఘంటసాల అని మరొక ముఖ్య అతిధి, గాయకుడు, సంగీత దర్శకుడు, పార్థ నేమాని కొనియాడారు.  30 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు వారికి భారతరత్న పురస్కార కోసం చేయడం అభినందనీయమన్నారు. ఘంటసాల గారిని మించిన భారతరత్నం ఏముంటుంది అని చెబుతూ వారు నిజంగా భారతరత్న'మే అని కొనియాడారు. పాటలతో సభికులను అలరించారు. 

చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణ కుమారి అతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంబం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతూ ఇప్పటిదాక ఈ కార్యక్రమంలో పాల్గొన్న 30 దేశాల సేవలను కొనియాడారు. 

యు.యెస్.ఏ నుండి డా. రాఘవ రెడ్డి గోసాల, ఉత్తర అమెరికాతెలుగు సంఘం నాటా మాజీ అధ్యక్షుడు, గంగసాని రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కొడాలి చక్రధరరావు తాన ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2003/05, వ్యవస్థాపక అధ్యక్షుడు టెన్నిస్సీ తెలుగు సమితి 1995/97, డాక్టర్ జయసింహ సుంకు, ఛైర్మన్, NRI వాసవి, ఐర్లాండ్ నుండి రాధా కొండ్రగంటి అధ్యక్షురాలు, ఐర్లాండ్ తెలుగుఅసోసియేషన్, జపాన్ నుండి శాస్త్రి పాతూరి, వాలంటీర్, జపాన్ తెలుగు సమాఖ్య, భారతదేశం నుండి కోలపల్లి హరీష్ నాయుడు, బ్యాంక్ ఆఫ్ శ్రీ ఘంటసాల (స్థాపించినది. 1974) మచిలీపట్నం, తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాలకి కేంద్రం  భారతరత్న అవార్డుతో సత్కరించాలి అని అందరూ ముక్తకంఠంతో కోరారు. అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి  భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.  

ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు ఐర్లాండ్, జపాన్  స్విట్జర్లాండ్, నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికాలోని తెలుగు సంస్థలతో 123 టీవీ కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. 

మరిన్ని వార్తలు