విజయవంతమైన తానా సాహిత్య సదస్సు

28 Sep, 2021 15:15 IST|Sakshi

అట్లాంటా, జార్జియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా సాహితీ విభాగం  ఆధ్వర్యంలో  ప్రతీ నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తోన్న  నెల నెలా తెలుగు వెలుగు సాహిత్య సమావేశం సెప్టెంబర్‌ 26న  విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తానా పాలకమండలి అధిపతి డాక్టర్‌  బండ్ల హనుమయ్య మాట్లాడుతూ ఎంతో మంది సాహితీ మూర్తులు తరతరాలుగా మనకు అందించిన  తెలుగు భాష,  ఆ భాషలోని సాహిత్య సిరిసంపదలు ఎన్నటికి తరగన్నారు.  

ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో పని చేస్తున్న అనేక మంది ఆలిండియా ప్రస్తుత, రిటైర్డ్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  నేటి ప్రపంచంలో ఆంగ్లభాషకున్న ప్రాధాన్యతను ఎవ్వరూ విస్మరించలేమని, విద్యార్ధులు ఎన్ని భాషలు నేర్చినా ఆంగ్లభాషలో మంచి పట్టు సంపాదించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే అదే సమయంలో తెలుగు భాష పట్ల నిర్లక్ష్యం తగదని వారు సూచించారు.  

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్‌  ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ  పిల్లలకు బాల్య దశ నుంచే తెలుగు భాషపై అవగాహన, ఆసక్తి పెంపొందించే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడిన కార్యకర్తలకు తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు.  
 

చదవండి : కెనడాలో తొలి తెలుగు సాహితి సదస్సు

మరిన్ని వార్తలు