Parag Agrawal : అడిషనల్‌ పేపర్‌ కోసం గొడవ.. శ్రేయా ఘోషల్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌ కూడా!

30 Nov, 2021 11:15 IST|Sakshi

మైక్రో బ్లాగింగ్‌ సైట్‌, సోషల్‌ మీడియా దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ట్విట్టర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పరాగ్‌ అగర్‌వాల్‌ నియమితుడైనప్పటి నుంచి అతను ఎవరూ? ఎక్కడ చదివాడు ? అతని కుటుంబ వివరాల గురించి సెర్చ్‌ చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. అయితే వ్యక్తిగత వివరాల విషయంలో పరాగ్‌ అగర్వాల్‌ చాలా గోప్యతను పాటిస్తున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా  ఆయన జీవితానికి సంబంధించి సేకరించిన కొన్ని విశేషాలు... 

పరాగ్‌ అగర్‌వాల్‌ పుట్టి పెరిగింది అంతా ముంబైలోనే. అటామిక్‌ ఎనర్జీ సంస్థలో ఉన్నత ఉద్యోగిగా పరాగ్‌ తండ్రి పని చేశారు. తల్లి స్కూల్‌ టీచర్‌గా పని చేసి రిటైర్‌ అయ్యారు. తండ్రి పని చేస్తున్న అటామిక్‌ ఎనర్జీ నిర్వహిస్తున్న స్కూల్‌లోనే పరాగ్‌ చదువుకున్నారు. 

శ్రేయా ఘోషల్‌ క్లాస్‌మేట్‌
ముంబైలోని అటామిక్‌ ఎనర్జీస్కూల్‌లో పరాగ్‌ అగర్‌వాల్‌, నేటి ప్రముఖ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ కలిసే చదువుకున్నారు. పరాగ్‌ పుస్తకాల పురుగుగా మారి పరీక్షల్లో టాప్‌ ర్యాంకులు సొంతం చేసుకుంటుంటే శ్రేయ సంగీత ప్రపంచంలో తిరుగులేని మహారాణిగా ఎదిగింది. ముందుగా శ్రేయా ఇండియన్‌ సెలబ్రిటీగా మారగా.. ఆ తర్వాత కొంత కాలానికి పరాగ్‌ ఇంటర్నేషన్‌ ఫేమస్‌ పర్సన్‌గా ఎదిగారు. వీరిద్దరి మధ్య ఇప్పటీకీ స్నేహం కొనసాగుతోంది. పరాగ్‌ ఇండియా వచ్చినా.. శ్రేయా అమెరికా వెళ్లినా కలుస్తుంటారు. ట్విట్టర్‌లో తరచుగా చాట్‌ చేస్తుంటారు కూడా.


ఇంటర్‌లోనే గోల్డ్‌ మెడల్‌
ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో 2001లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిజిక్స్‌ ఒలంపియాడ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు.


జేఈఈ ఎగ్జామ్‌లో గొడవ
ఐఐటీలో సీటు లక్ష్యంగా ప్రిపేర్‌ అవుతూ వచ్చిన పరాగ్‌ జేఈఈ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌లో ఇన్విజిలేటర్లతో గొడవ పడ్డాడు. పరీక్ష ప్రారంభమైన నలభై నిమిషాల్లోనే తనకు తెలిసిన అన్ని ప్రశ్నలకు సమాధానం రాసిన పరాగ్‌.. ఆ తర్వాత అడిషనల్‌ పేపర్లు కావాలంటూ ఇన్విజిలేటర్‌ని కోరాడు.. ‘ ఈ పరీక్షలో అడిషనల్‌ పేపర్ల కాన్సెప్ట్‌ లేదు’ అంటూ ఇన్విజిలేటర్‌ సమాధానం ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఇన్‌స్ట్రక‌్షన్‌ బుక్‌లెట్‌లో ‘‘టై ఆల్‌ ది సప్లిమెంట్స్‌ కరెక్ట్‌లీ ఇన్‌ రైట్‌ ఆర్డర్‌’’ అనే నిబంధన ఎందుకు చేర్చినట్టు అంటూ ఎదురు ప్రశ్నించారు. అలా ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. దీంతో పరీక్షలో విలువైన సమయం వృథా అయ్యిందని ఇప్పటికీ పరాగ్‌ గుర్తు చేసుకుని బాధపడతారు.


ముంబై టూ స్టాన్‌ఫోర్డ్‌
జేఈఈ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌లో చిన్న గొడవ జరిగినా.. ఆలిండియా 77వ ర్యాంకు సాధించి ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో చేరాడు. 2005లో పట్టా పుచ్చుకుని ఉన్నత విద్య కోసం అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చేరుకున్నాడు. అక్కడే డాక్టరేట్‌ పట్టా సైతం పుచ్చుకున్నాడు. అప్పటి నుంచే ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ మీద ఎక్కువగా ఫోకస్‌ చేశారు.


మైక్రోసాఫ్ట్‌తో మొదలు
‍స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి పరాగ్‌ బయటకు వచ్చిన తర్వాత మొదటి సారి మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత యాహూ, ఏటీ అండ్‌ టీల మీదుగా 2011లో ట్విట్టర్‌లో చేరారు పరాగ్‌. ఆ సమయంలో ట్విట్టర్‌ మొత్తం ఉద్యోగుల సంఖ్య వెయ్యికి అటుఇటుగా ఉంది. అప్పటి నుంచి టీమ్‌ వర్క్‌ చేస్తూ ట్విట్టర్‌ ఉన్నతిలో కీలక భూమిక పోషించారు. 


తొలిచూపులు అక్కడే
స్టాన్‌ఫోర్డ్‌లో చదివేప్పుడే వినీతతో పరిచయం. అమె అక్కడ మెడికల్‌ సైన్స్‌ విద్యార్థిగా చేరింది. ఆ తర్వాత వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. వారికి అన్ష్‌ అగర్వాల్‌ అనే బాబు ఉన్నాడు. ప్రస్తుతం అండర్‌సన్‌ హారోవిట్జ్‌ అనే వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలో భాగస్వామిగా ఆమె ఉన్నారు. 

చదవండి: ట్విటర్‌ కొత్త సీఈవో పరాగ్‌.. యంగెస్ట్‌ సీఈవో ఘనత,కానీ చిన్న మెలిక!

మరిన్ని వార్తలు