సంగీత దర్శకుడిగా ఘంటసాల ఒక చరిత్ర: దేవిశ్రీ ప్రసాద్

30 Aug, 2022 23:18 IST|Sakshi

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలనే నినాదం కొంత కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర నేత్రాలయ యు.ఎస్.ఏ. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యములో 165 పైగా టీవీ చర్చ కార్యక్రమాలు కూడా ఇటీవలే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా ప్రముఖ దర్శకులు సుకుమార్, ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, ప్రముఖ రచయిత, నటులు దర్శకులు తనికెళ్ళ భరణి, ప్రముఖ గేయరచయితలు చంద్రబోస్ అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ ప్రత్యేక కార్యక్రమం 10 మంది సహ నిర్వాహకులతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా 100 మంది పైగా గాయనీగాయకులతో కలిసి ఘంటసాల శత గళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి భాగాన్ని 21 ఆగస్టు నాడు ప్రసారం చేయడం, దానికి అనూహ్యమైన స్పందన వచ్చిందని నిర్వాహుకులు తెలియజేశారు. 28 ఆగష్టు నాడు రెండవ భాగం ప్రసారం చేశారు.  మిగతా రెండు భాగాలు 4 సెప్టెంబర్, 11 సెప్టెంబర్ లో ప్రసారం చేయనున్నారు.


 
శత గళార్చన రెండవ భాగంలో పాల్గొన్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ఘంటసాల గొప్ప గాయకులూ అని చెబుతూ, అదే సమయంలో గొప్ప సంగీత దర్శకుడిగా అంతే గొప్ప విజయం సాధించారని, తరతరాలుగా గుర్తుండి పోయే వ్యక్తి ఘంటసాల అని కొనియాడారు. అలాగే వారి పాడిన భగవద్గీత మన అందరి  హృదయాలలో ఇప్పటికి ఎప్పటికి మరిచిపోలేనంత ముద్ర వేసిందని చెప్పుకొచ్చారు. అంతటి గొప్ప అవకాశం రావడం అంటే వారు నిజంగా కారణజన్ములు అని.. అలాగే వారి పాడిన భగవద్గీతని వినడం మనమందరము, రాబోయే తరాలు కూడా చేసుకున్న అదృష్టమని చెప్పారు. ఘంటసాల శతజయంతి సందర్భంగా వారికి భారత రత్న ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

రామ్ దుర్వాసుల (అట్లాంటా, యూఎస్‌ఏ) బృందం నుంచి దర్భా భాస్కర్, కృష్ణమాచారి కారంచేడు, మోహన్ దేవ్,  రాధికా నోరి, స్రవంతి కోవెల, శ్రీయాన్  కోవెల, దుర్గ గోరా పలువురు గాయకులు పాల్గొని ఘంటసాల పాటలు పాడి చక్కటి వ్యాఖ్యానంతో ఘంటసాలని స్మరించుకున్నారు.
దేశవిదేశాల నుంచి పాల్గొన్న కొందరు ప్రముఖులు: ఇండోనేషియా నుంచి తెలుగు అసోసియేషన్ అఫ్ ఇండోనేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు టీవీయస్ ప్రవీణ్, ఒమాన్ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షుడు అనిల్ కుమార్ కడించర్ల.

మరిన్ని వార్తలు