సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి

7 Dec, 2021 14:51 IST|Sakshi

జెడ్డా: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. భారత్‌కి చెందిన మహ్మద్‌ జబీర్‌ కొంత కాలంగా కుటుంబంతో కలిసి సౌదీలోని జుబైల్‌లో  నివసిస్తున్నాడు. ఇటీవల అతనికి జుబైల్‌ నుంచి జిజాన్‌లో ఉన్న ప్రాంతానికి బదిలీ జరిగింది.

కొత్త ఆఫీసులో చేరేందుకు డిసెంబరు 4న జుబైల్‌ నుంచి జిజాన్‌కి బయల్దేరారు. భార్య షబ్నంతో పాటు ముగ్గురు పిల్లలు కారులో వెళ్లగా లగేజీ ట్రక్‌ వేరుగా వెళ్లింది. అయితే లగేజ్‌ ట్రక్‌ గమ్యస్థానం చేరుకున్నా జబీర్‌ కుటుంబం గమ్యస్థానం చేరుకోలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు అక్కడున్న ఎన్నారైలను కాంటాక్ట్‌ అయ్యారు. 

చివరకు జబీర్‌ కుటుంబం కారులో జుబైల్‌ నుంచి జిజాన్‌కి వెళ్తుండగా మార్గమధ్యంలో బిషా దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలొఓ మరణించినట్టు తేలింది. జబీర్‌ కుటుంబం ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో ప్రమాద స్థలిలోనే కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు.

మృతులు కేరళాలోని కోజికోడ్‌ జిల్లాలోని బైపోర్‌ ప్రాంతానికి చెందిన వారు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో జబీర్‌ (44), షబ్నం (36)లతో పాటు పిల్లలు లైబా (7), సాహా (5), లుఫ్తీ (3) మరణించారు. మృతదేహాలను ఇండియాకు తీసుకు వచ్చే ఏర్పాట్లలో ఇండియన్‌ కాన్సులేట్‌ అధికారులతో పాటు వెల్ఫేర్‌ అసోసియేషన్‌  సభ్యులు  ఉన్నారు. 

మరిన్ని వార్తలు