అమెరికా న్యూజెర్సీలో తెలుగు కుర్రాడి ఘనత

7 Feb, 2023 17:29 IST|Sakshi

విద్యార్థి గళంలో విజేత సాహిత్‌

టాప్‌ స్పీకర్‌ అవార్డు గెలుచుకున్న సాహిత్‌ మంగు

హైదరాబాద్‌ నుంచి వలస వెళ్లి అమెరికా న్యూజెర్సీలో స్థిరపడిన ఓ కుటుంబం నుంచి వచ్చిన సాహిత్‌ మంగు ప్రసంగాలతో అదరగొట్టాడు. ప్రతిష్టాత్మక గార్డెన్‌ స్టేట్‌ డిబేట్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు.  సాహిత్‌ మంగు, ఏడో తరగతి అబ్బాయి. భారత్‌ నుంచి వచ్చిన హైదరాబాదీ కుటుంబం తనది. న్యూజెర్సీ సోమర్‌సెట్‌లోని సెడార్‌ హిల్‌ ప్రిపరేటరీ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. 

న్యూజెర్సీ రాష్ట్రంలో ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా డిబెట్‌ లీగ్‌ టోర్నమెంట్లు జరుగుతాయి. ఈ ఏడాది వేర్వేరు పాఠశాలలకు చెందిన 164 మంది విద్యార్థులు ఈ లీగ్‌లో పోటీ పడగా.. సాహిత్‌ మంగు గోల్డెన్‌ గావెల్‌ టాప్‌ స్పీకర్‌ అవార్డు దక్కించుకున్నాడు. సాహిత్‌ చేసిన పరిశోధన, లోతైన విషయ అవగాహనకు తోడు ధాటిగా చేసిన ప్రసంగం న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. సాహిత్‌ను విజేతగా ప్రకటించిన జడ్జిలు... అతడు ఎంచుకున్న అంశాలను, వాటికి మద్ధతుగా సేకరించిన విషయాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. 

డిబేట్‌లో సాహిత్‌ ఎంచుకున్న అంశాలు

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను నిషేధించాలి
అమెరికాలో అందరికీ ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావాలి
ఫేసియల్‌ టెక్నాలజీ వల్ల చెడు కంటే మంచే ఎక్కువ
శాఖాహారమే మంచిది, మాంసాహారం సరి కాదు

మరో ఫ్రెండ్‌తో కలిపి డిబేట్‌లో పాల్గొన్న సాహిత్‌.. నాలుగు అంశాల్లోనూ ధాటిగా తన వాదనను వినిపించి జడ్జిలను మెప్పించాడు. మొత్తమ్మీద విజేతగా నిలిచి గోల్డెన్‌ గావెల్‌ టాప్‌ స్పీకర్‌ అవార్డు అందుకున్నాడు.

మరిన్ని వార్తలు