ఘంటసాల తెలుగు పాట చిరునామా మాత్రమే కాదు పాటల సౌధానికి పునాది: అనంత్ శ్రీరామ్

14 Sep, 2022 18:34 IST|Sakshi

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకలు సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదం ఊపందుకున్న విషయం విదితమే. శంకర నేత్రాలయ యు.ఎస్.ఏ. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో 190 టీవీ చర్చ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ పాల్గొన్న ఈ ప్రత్యేక కార్యక్రమం, 10 మంది సహ నిర్వాహకులు అయిన రత్నకుమార్ కవుటూరు, శారద ఆకునూరి, రెడ్డి ఉరిమిండి, శ్యాం అప్పాలి, విజు చిలువేరు,  నీలిమ గడ్డమణుగు, రామ్ దుర్వాసుల, ఫణి డొక్కా, జయ పీసపాటి, శ్రీలత మగతలతో కలిసి ప్రపంచవ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులతో  ఘంటసాల శత గళార్చన కార్యక్రమంను నిర్వహించగా.. మొదటి మూడు భాగాలు 21, 28 ఆగస్టు, 4 సెప్టెంబర్ నాడు ప్రసారం చేయగా అనూహ్యమైన స్పందన వచ్చిందని, 11 సెప్టెంబర్ నాడు చివరి భాగం ప్రసారమైందని  నిర్వాహకులు తెలిపారు.
 
ముందుగా బాల రెడ్డి ఇందూర్తి శత గళార్చన నాల్గవ (చివరి) భాగంలో పాల్గొన్న ముఖ్యఅతిథి ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ ఘంటసాల అంటే తెలుగు పాటకి  చిరునామె కాదు తెలుగు పాటల సౌధానికి పునాది లాంటి వారని కీర్తించారు. ఘంటసాలతోనే తెలుగు పాట ప్రపంచవ్యాప్తమైందన్నారు. అలాగే జర్మనీ లాంటి తెలుగుకి ఏ మాత్రము సంబంధం లేని దేశాలలో కూడా ఆయన ప్రదర్శన అక్కడ ప్రజల్ని ఆకట్టుకుంది అంటే అది తెలుగు బాషాకి ఎంత ఔన్నత్యం ఉందొ తెలుగు బాషాని ప్రాచుర్యం చేసిన ఆయన గొంతుకి కూడా ఉన్నతి, ఆ ఘనత దక్కుతుందన్నారు.  పాటలకు చమత్కారం జోడించి పాడటం అనేది అది వారికొక్కరికే సాధ్యమయ్యిందని తెలిపారు. నిజంగా ఇలాంటి గాయకుడు ఉండటం వల్లనే తెలుగు భాష ఇంత పరిఢవిల్లుతుంది అని అనిపించింది.. ఘంటసాల గారి పుష్పవిలాపం, కుంతి విలాపం, గోవిలాపం గాని పద్యాలు మనం వింటే చదువుతున్నప్పుడు ఆ పద్యం లోని భావం అర్ధం కొంతవరకు అవగతం అవుతుందేమో కానీ వారు పాడుతున్నప్పుడు భావం, అర్ధంతో పాటు కవిలోని ఆర్ద్రత కూడా ఆవిష్కరించబడింది. ఇలాంటి గాయకుడు దొరకడం తెలుగు వారిగా మన అదృష్టం.. ఇలాంటి గాయకుడు పాడిన బాషాని విని అర్థం చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం, అటువంటి గాయకుడు నభూతో నభవిష్యత్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదన్నారు.

శత గళార్చన  నాలుగు భాగాల స్వాగతోపన్యాసంతో మనల్ని అలరించిన శారద ఆకునూరి (హ్యూస్టన్, USA), ఈ చివరి భాగంలో  తన  బృందం నుంచి వరప్రసాద్ బాలినేని, పేరూరి వెంకట సోమశేఖర్, కృష్ణ నాలాది, రాజశేఖర్ సూరిభొట్ల, సురేష్ ఖాజా, జ్యోతిర్మయి బొమ్ము, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, రమణ జువ్వాది, సత్యనారాయణ ఉల్మురి, ఉష మోచెర్ల ఘంటసాల పాటల ద్వారా ఆయనను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమములో శ్యామ్ అప్పాలి (లాస్ ఏంజెలెస్, USA) బృందం నుంచి సాయి కాశీభొట్ల, శ్రీనివాస్ రాణి, ప్రసాద్ పార్థసారధి, సుధాకర్, వర్మ అల్లూరి, శ్రీహర్ష, శ్రీవల్లి శ్రీధర్, శ్రీయాన్ కంసాలి, ఆదిత్య కార్తీక్ ఉపాధ్యాయుల, అనూష వెన్నల, గౌరిధర్ మధు, రాజ్యలక్ష్మి వుదాతు, మీనాక్షి అనిపిండి, శాంత సుసర్ల, రఘు చక్రవర్తి, శ్రీధర్ జూలపల్లి, హరీష్ కొలపల్లి, నారాయణరెడ్డి ఇందుర్తి, వంశీకృష్ణ ఇరువరం పాల్గొన్నారు. శ్యాం అప్పాలి శత గళార్చన 4 భాగాలకు సాంకేతిక సహాయాన్ని కూడా అందించారు. 

శతగళార్చన కార్యక్రమంపై ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, వారి కోడలు కృష్ణకుమారి మాట్లాడుతూ ముందుగా "ఘంటసాల కు భారతరత్న" కోసం కృషి చేస్తున్న 33 దేశాల నుంచి 119 మంది పాల్గొనడం చాలా సంతోషం కలిగిందని, వారందరికీ మా ప్రత్యేక  ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. అలాగే విశిష్ట అతిధులుగా దర్శకుడు సుకుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, రచయిత, నటులు దర్శకులు తనికెళ్ళ భరణి, గేయ రచయితలు చంద్రబోస్ అనంత శ్రీరామ్ తదితరులుకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఇన్ని కార్యక్రమాలను విజయవంతం నిర్వహించిన బాలరెడ్డి ఇందుర్తి, సింగపూర్ రత్న కుమార్ కవుటూరు ధన్యవాదములు తెలియచేసారు. శత గళార్చనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని. చాలా మంది ప్రముఖులు "ఘంటసాల గారికి భారతరత్న" విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ఘంటసాల కుటుంబ సభ్యులకు,  ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ బాల రెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

మరిన్ని వార్తలు