గల్ఫ్‌ కార్మికులను ఆదుకోవాలి - జేఏసీ డిమాండ్‌

25 Jun, 2022 14:12 IST|Sakshi

గల్ఫ్ కార్మికులకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి మంత్రి కేటీఆర్ కు గల్ఫ్ జెఏసి బృందం వినతిపత్రం ఇచ్చింది. ముస్తాబాద్‌లో ఆయన్ను కలిసి గల్ఫ్‌ జేఏసీ ప్రతినిధులు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తో వారు మాట్లాడుతూ కరోనా సందర్బంగా గల్ఫ్ తదితర దేశాల నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి యాజమాన్యాల నుండి రావలసిన  జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్,  గ్రాట్యుటీ లాంటి 'ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్' (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు)  రాబట్టుకోవడం వారి హక్కన్నారు. కావున బాధితుల పక్షాన ప్రభుత్వం నిలబడి న్యాయ సహాయం అందించి కార్మికులను ఆదుకోవాలి కోరారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 15 లక్షల మంది గల్ఫ్‌ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఓమన్, ఖతర్, కువైట్‌, బహ్రెయిన్ దేశాలతో పాటు మలేషియా, సింగపూర్, అఫ్గానిస్తాన్, ఇరాక్, లిబియా తదితర  దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారని తెలిపారు.  వీరందరి సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమైన డిమాండ్లు..
- గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. 
- గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు వీసా చార్జీలు, రిక్రూట్మెంట్ ఫీజులు తదితర ఖర్చులకోసం పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలి.  
- గల్ఫ్ లో చనిపోయిన కార్మికులకు రైతు బంధ, రైతు బీమా లాంటి రూ. 5 లక్షల  "గల్ఫ్ ప్రవాసీ బీమా" పథకం ప్రవేశపెట్టాలి. ఈ పథకం ప్రవేశపెడితే ప్రభుత్వంపై ఎక్స్ గ్రేషియా (మృతధన  సహాయం) భారం ఉండదు.   
- విదేశాలకు వెళ్లి నష్టపోయి తిరిగి వచ్చిన వారిని ఆదుకోవడానికి కార్మికులు నైపుణ్యం మరియు అనుభవాన్ని ఉపయోగించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు సబ్సిడీతో కూడిన రుణాలను ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలను తక్షణం  కల్పించాలి. వాపస్ వచ్చినవారు జీవితంలో స్థిరపడటానికి పునరావాసం, పునరేకీకరణ కొరకు ప్రత్యేక పథకం రూపకల్పన చేయాలి.
- జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం. 
- హైదరాబాద్ లో  ప్రవాసీ భవన్ ఏర్పాటు. 
- తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణం వంటి పథకాలను వర్తింపజేయాలి.
- 24 గంటల హెల్ప్ లైన్ (సహాయ కేంద్రం) ఏర్పాటు చేయాకి. 
- విదేశాల్లో ఉన్న వలసకార్మికులు, ఉద్యోగులు, వృత్తినిపుణులు, విద్యార్థుల రిజిస్ట్రేషన్ కొరకు 'ప్రవాసి తెలంగాణ' వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలి .
- ధనవంతులైన ఎన్నారైలు గ్రామాలను దత్తత తీసుకునేలా ప్రోత్సాహించాలి. 
- గల్ఫ్ లోని  ప్రవాస తెలంగాణీయులకు ఒక వేదిక కల్పించడానికి, రాష్ట్రంతో బంధం ఏర్పరచడానిక వార్షిక ప్రవాసి వేడుకను నిర్వహించడానికి 'గల్ఫ్ ప్రవాసి తెలంగాణ దివస్' ను జరుపాలి. సమస్యలను చర్చించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. వివిధ రంగాలలో సేవలందించిన ప్రవాసీలకు  అవార్డులను ప్రధానం చేయాలి.  
- గల్ఫ్ ఎన్నారైలు తమ అమూల్యమైన  ఓటు హక్కును ఆన్ లైన్ ద్వారా  వినియోగించుకునేలా చేయాలి. 

చదవండి: గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న పాతబస్తీ మహిళలు.. సాయం కోసం..

మరిన్ని వార్తలు